డ్రగ్స్ కేసులో నమ్రత పేరు
ABN , First Publish Date - 2020-09-23T07:15:20+05:30 IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు భార్య, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ
తెరపైకి నటుడు మహేశ్బాబు భార్య పేరు
జయా సాహా చాట్ గ్రూప్లో ‘ఎన్’ అక్షరం
నమ్రతేనని జాతీయ మీడియాలో వార్తలు
ఆరోపణలను ఖండించిన నమ్రత టీం
దియా మీర్జా పైనా ఆరోపణలు.. ఖండన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు భార్య, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జయా సాహాతో నమ్రత చాటింగ్ చేసినట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ట్రాకింగ్లో బయటపడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. జయా సాహా వాట్సాప్ చాటింగ్ గ్రూప్లో ఆమె డ్రగ్స్ సరఫరా చేసిన నటీమణుల పేర్లకు సంబంధించిన పొడి అక్షరాలు ఉన్నట్లుగా ఎన్సీబీ గుర్తించినట్లు వార్తలొచ్చిన విష యం తెలిసిందే.
ఇందులో ‘ఎన్’ అనే అక్షరంతో ప్రారంభమైన పేరుగల నటితోనూ సంభాషించినట్లు ఉందని, ఆ నటి నమ్రతా శిరోద్కరేనని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నట్లు ఆజ్తక్, సీఎన్ఎన్ న్యూస్-18 సహా పలు చానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఈ ఆరోపణలను నమ్రత టీం ఖండించింది. నమ్రత పేరు ను తప్పుగా ఉపయోగిస్తున్నారన్నది.
కాగా, బాలీవుడ్కు చెందిన మరో నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. 2019లో దియా తన మేనేజర్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిందని ఎన్సీబీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను దియా మీర్జా తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్తో తనకు సంబంధం లేదని, తనపై ఆరోపణలు చేసే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ట్విటర్లో పేర్కొన్నారు.
ఫేక్ అకౌంట్ను చూసి అనురాగ్ కశ్య్పపై బెంగాలీ నటి ఆరోపణలు
నటి పాయల్ ఘోష్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యపై బెంగాలీ నటి రూపా దత్తా కూడా ఆరోపణలు చేశారు. అయితే ఫేస్బుక్లో నకిలీ ఖాతాలో పోస్ట్ చేసిన కామెంట్ల ఆధారంగా ఆమె ఈ ఆరోపణలు చేశారు. 2014లో ఫేస్బుక్లో మహిళలపై అనురాగ్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని, దీంతో మహిళల పట్ల అతనికి చులకన భావం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకొని అతనితో సంభాషణను ముగించానని తెలిపారు.
అప్పటి వ్యాఖ్యల స్ర్కీన్షాట్లను రూపాదత్తా పోస్ట్ చేశారు. అయితే ఆ ఫేక్బుక్ ఖాతా అనురాగ్ కశ్య్పది కాదని, అనురాగ్ సఫర్ అనే మరో వ్యక్తిదని తేలింది. ఈ విషయాన్ని 2010, 2016లలో అనురాగ్ సఫర్ స్వయంగా వెల్లడించారు. తాను సినీ దర్శకుడు అనురాగ్ కశ్య్పను కాదన్నారు.
పాయల్పై హుమా ఖురేషీ ఆగ్రహం..
అనురాగ్ కశ్య్పతో వివాదంలోకి పాయల్ ఘోష్ తనపేరును లాగడంపై మరో నటి హుమా ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు రిచాచద్దా, మహీగిల్, హుమా ఖురేషీ కూడా అనురాగ్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని పాయల్ ఆరోపించడాన్ని తప్పుబట్టారు. అనురాగ్తో తాను 2012-13లో పని చేశానని, తన పట్ల ఆయన ఏనాడూ అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు.
‘మీ టూ’ ఉద్యమ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హుమా అన్నారు. కాగా, అనురాగ్ కశ్యప్పై చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అని పాయల్ ఘోష్ను మరో నటి రాజశ్రీ దేశ్పాండే ప్రశ్నించారు. అనురాగ్ వేధింపులకు పాల్పడితే కచ్చితంగా ఆయనను శిక్షించాల్సిందేనని, కానీ.. పాయల్ అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం మొత్తం ‘మీ టూ’ ఉద్యమానికే విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ మేరకు రాజశ్రీ మంగళవారం పాయల్కు బహిరంగ లేఖ రాశారు.
మరోవైపు అనురాగ్ కశ్య్పకు మద్దతు పలుకుతున్న వారిపై పాయల్ ఘోష్ మండిపడ్డారు. తన గొంతు నొక్కేందుకు ప్రతిరోజూ వేల కొద్దీ ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు.
దీపిక మేనేజర్కు సమన్లు
అగ్రతార దీపికా పదుకొనే కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్కు ఎన్సీబీ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఆమె పనిచేస్తున్న టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ క్వాన్ సీఈవో ధ్రువ్ చిట్గోపేకర్కు కూడా సమన్లు ఇచ్చారు. చిట్గోపేకర్ ఇప్పటికే దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కాగా, కరిష్మా కొంత సమయం కోరినట్లు ఓ అధికారి తెలిపారు.
నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి విచారణలో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ తారలు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ తదితరుల పేర్లను రియా వెల్లడించినట్లు, వారిని ఈ వారంలోనే విచారిస్తారని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి.
కాగా.. రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మంగళవారం మరో 14 రోజులపాటు (అక్టోబరు 6 వరకు) పొడిగించింది. రియా, ఆమె సోదరుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు బుధవారం విచారించనుంది.