నటి శ్రావణి రిమాండ్ రిపోర్ట్‌లో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2020-09-16T17:19:28+05:30 IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.

నటి శ్రావణి రిమాండ్ రిపోర్ట్‌లో కొత్త ట్విస్ట్

హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.  రిమాండ్ రిపోర్ట్‌లో A1గా దేవరాజ్ రెడ్డి, A2గా సాయికృష్ణ రెడ్డి, A3గా అశోక్ రెడ్డిని చేర్చుతూ పోలీసులు రిపోర్టును సిద్ధం చేశారు. కేసుకు సంబంధించిన  రిమాండ్ రిపోర్టు ఏబీఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. కాగా ప్రెస్ మీట్‌లో A3గా దేవ్ రాజ్ పేరును చేర్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ రిమాండ్ రిపోర్టులో ఏ1, ఏ2, ఏ3గా మార్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఈ కేసులో పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ముందు దేవ్ రాజ్‌రెడ్డికి శ్రావణి ప్రపోజ్ చేసింది. శ్రావణి కుటుంబసభ్యులు దేవ్‌రాజ్‌ను అడగడంతో ఒప్పుకోలేదు. శ్రావణి దేవ్‌రాజ్‌ను ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే  సాయి కృష్ణ, అశోక్ రెడ్డి‌లతో శ్రావణి రిలేషన్ ఉండటంతో దేవ్‌రాజ్ ఒప్పుకోలేదని విచారణలో తేలింది.


ఆ తరువాత దేవ్‌రాజ్‌ను కలవడానికి శ్రావణి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ చేసినా స్పందించలేదు. అయితే  సాయికృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను బెదిరించారని పోలీసులు తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని దేవరాజ్ తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్‌కు వెళ్లారు. ఇది తెలిసిన సాయిరెడ్డి రాత్రి 9:30గంటలకు హోటల్‌కు చేరుకుని శ్రావణిని కొట్టి ఆటోలో తీసుకెళ్లాడు. దేవ్‌రాజ్‌తో కలవకూడదని శ్రావణిని సాయి, అశోక్ రెడ్డి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దేవ్‌రాజ్‌ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోమని బెదిరింపులకు పాల్పడ్డారు.  దీంతో తీవ్ర భయాందోళనకు గురైన శ్రావణి హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని దేవ్‌రజ్‌ను కోరింది. శ్రావణితో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో  దేవ్‌రాజ్, సాయి కృష్ణ, అశోక్ రెడ్డిల వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దేవ్‌రాజ్, సాయి కృష్ణలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 


అశోక్‌రెడ్డి కోసం గాలింపు

మరోవైపు శ్రావణి ఆత్మ హత్య కేసులో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఎస్ఆర్‌నగర్ పోలీసుల ముందు విచారణకు వస్తానని చెప్పిన అశోక్‌రెడ్డి మస్కా కొట్టాడు. శ్రావణి ఆత్మ హత్య కేసులో కీలక నిందితుడిగా అశోక్ రెడ్డి ఉన్నారు. సినిమాలో అవకాశాల పేరుతో శ్రావణిని అశోక్‌రెడ్డి పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. అశోక్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2020-09-16T17:19:28+05:30 IST