అదానీ సంపదలో రూ.66,600 కోట్లు ఫట్
ABN , First Publish Date - 2021-06-18T09:48:23+05:30 IST
ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద.. ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఇండెక్స్ ప్రకారం.. బుధవారంతో ముగిసిన మూడు రోజుల్లో ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా 900 కోట్ల డాలర్ల (రూ.66,600 కోట్లు) మేర తగ్గి 6,760 కోట్ల డాలర్లకు (రూ.5,00,240 కోట్లు) పడిపోయింది.
మూడు రోజుల్లో ఆయన కోల్పోయిన ఆస్తి ఇది
ఆసియా రిచ్ లిస్ట్లో 2 నుంచి 3వ స్థానానికి
స్టాక్ మార్కెట్లలో ఆగని గ్రూప్ కంపెనీల షేర్ల పతనం
ముంబై: ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద.. ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఇండెక్స్ ప్రకారం.. బుధవారంతో ముగిసిన మూడు రోజుల్లో ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా 900 కోట్ల డాలర్ల (రూ.66,600 కోట్లు) మేర తగ్గి 6,760 కోట్ల డాలర్లకు (రూ.5,00,240 కోట్లు) పడిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో భారీగా పతనమవడం ఇందుకు కారణం. ఈ వారం ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది అదానీయే. దాంతో ఆయన ఆసియా కుబేరుల్లో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి జారుకున్నారు. ప్రస్తుతం బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో చైనా పారిశ్రామికవేత్త జాంగ్ షాన్షాన్.. అదానీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. షాన్షాన్ వ్యక్తిగత సంపద 6,940 కోట్ల డాలర్లుగా ఉంది. 8,450 కోట్ల డాలర్ల ఆస్తితో ముకేశ్ అంబానీ ఆసియా నెం.1 కుబేరుడిగా కొనసాగుతున్నారు.
కారణమేంటి..?
అదానీ గ్రూప్ కంపెనీల్లో అధిక వాటాలు కలిగిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ)లో మూడింటి డీమ్యాట్ ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) స్తంభింప చేసిందన్న వార్తలు ఇందుకు కారణం. అల్బులా ఇన్వె్స్టమెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వె్స్టమెంట్ ఫండ్లకు చెందిన ఖాతాలను ఎన్ఎ్సడీఎల్ ఫ్రీజ్ చేసిందని, ఆ మూడు అకౌంట్లలోని అదానీ కంపెనీల షేర్ల విలువ రూ.43,500 కోట్లని ఒక వార్తా కథనం పేర్కొంది. దాంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో అదానీ గ్రూప్లోని ఆరు లిస్టెడ్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. విదేశీ ఫండ్ల డీమ్యాట్ ఖాతాలను ఎన్ఎ్సడీఎల్ స్తంభింపజేయలేదని, డిపాజిటరీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ నుంచి తమకు లిఖితపూర్వక ధ్రువీకరణ లభించిందంటూ అదానీ గ్రూప్ వెంటనే వివరణ ఇచ్చింది. దాంతో గ్రూప్ షేర్లు కాస్త కోలుకున్నప్పటికీ.. చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఆ ఎఫ్పీఐల ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని స్వయంగా ఎన్ఎ్సడీఎల్ ప్రకటించినప్పటికీ.. ఈ వారంలో అదానీ గ్రూప్ షేర్ల వరుస నష్టాలకు అడ్డుకట్ట మాత్రం పడలేదు.
మరోవైపు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ’’
నాలుగు రోజుల్లో రూ.1.59 లక్షల కోట్ల నష్టం
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో వరుసగా నాలుగో రోజూ నష్టాలు చవిచూశాయి. దాంతో గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ నాలుగు రోజుల్లో రూ.1.59 లక్షల కోట్ల మేర తగ్గింది. ఈ నెల 11న (గత శుక్రవారం) అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ.9.51 లక్షల కోట్లు కాగా, 17 నాటికి (గురువారం) రూ.7.92 లక్షల కోట్లకు జారుకుంది. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల షేర్లైతే ఈ నాలుగు రోజులూ లోయర్ సర్యూట్ను తాకాయి. ఈ వారంలో గ్రూప్ షేర్లు 9 శాతం నుంచి 22 శాతం వరకు నష్టపోయాయి. గురువారం బీఎస్ఈలో అదానీ పోర్ట్స్ షేరు అత్యధికంగా 8.5 శాతం నష్టపోయి రూ.646.80 వద్ద క్లోజవగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 5.61 శాతం నష్టంతో రూ.1,367.95 వద్ద, అదానీ పవర్ షేరు 4.99 శాతం నష్టపోయి రూ.120.90 దగ్గర క్లోజయ్యాయి. కాగా అదానీ ట్రాన్స్మిషన్ షేరు కూడా 5 శాతం తగ్గి రూ.1,300.90 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 4.94 శాతం నష్టపోయి రూ. 1,113.35 దగ్గర ముగియగా అదానీ టోటల్ గ్యాస్ షేరు 5 శాతం నష్టంతో రూ.1,324.30 వద్ద క్లోజైంది.
మూడు ఎఫ్పీఐల వాటాలు, పెట్టుబడులు
రిటైల్ మదుపరులూ జాగ్రత్త
ప్రస్తుతం రిటైల్ మదుపర్లు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లకు దూరంగా ఉండటమే మేలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత వివాదంపై మరింత స్పష్టత లేదా కొలిక్కి వచ్చే వరకు ఈ గ్రూప్ షేర్లలో కొత్తగా పెట్టుబడులు వద్దని వారు వారిస్తున్నారు. అయితే ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగుతుండటంతో గ్రూప్ కంపెనీల షేర్లు నాలుగు రోజుల నుంచి నష్టాల్లో క్లోజవుతూ వస్తున్నాయని వారంటున్నారు. మరోవైపు గడచిన ఏడాది కాలంగా గ్రూప్ కంపెనీల షేర్లు పెరుగుతూ వస్తుండటం కూడా ప్రస్తుత లాభాల స్వీకరణకు కారణంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎఫ్పీఐల వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు రెగ్యులేటరీ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయని, సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని పరిష్క రిస్తే ఇన్వెస్టర్లు మరింత నష్టపోకుండా చూసే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులంటున్నారు.