కుంగిపోతున్న ఏడీబీ రోడ్డు
ABN , First Publish Date - 2021-06-24T07:53:16+05:30 IST
రాజానగరంనుంచి సామర్లకోట వరకూ ఉన్న ఏడీబీరోడ్డును అభివృద్ధి పరిచి నాలుగులైన్ల రహదారిగా అభివృద్ధి పరచడానికిగాను ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపట్టారు.
- నిర్మాణ దశలోనే ఇలా ఉంటే.. తర్వాత పరిస్థితి ఏంటో..?
రంగంపేట, జూన్ 23: రాజానగరంనుంచి సామర్లకోట వరకూ ఉన్న ఏడీబీరోడ్డును అభివృద్ధి పరిచి నాలుగులైన్ల రహదారిగా అభివృద్ధి పరచడానికిగాను ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపట్టారు. ఏడీబీ రోడ్డు రాజానగరంనుంచి కాకినాడ పోర్టు వరకూ ఉండగా మొదటి దశలో రాజానగరంనుంచి సామర్లకోట వరకూ అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలిచారు. బీఎస్ఆర్ కంపెనీ ఈ పనులు ప్రారంభించింది. సామర్లకోటనుంచి రాజానగరం వరకూ పలు ప్రాంతాల్లో రోడ్డును అభివృద్ధి చేసి తారురోడ్డుగా మార్పు చేస్తున్నారు. కాగా రంగంపేట-వడిశలేరు గ్రామాల మధ్య చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా రెండుచోట్ల కల్వర్ట నిర్మాణం చేపట్టారు. ఈ కల్వర్టులవద్ద రోడ్డు కుంగిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒక కల్వర్టువద్ద పలుమార్లు రోడ్డు కుంగిపోవడంతో పలు వాహనాలకు ప్రమాదాలు జరిగాయి. ఐదుగురు ప్రయాణికులు ఈ ప్రమాదాల్లో చనిపోయారు. ఆ కల్వర్టును ఇటీవల నూతనంగా నిర్మించి తారు రోడ్డు వేశారు. మరోవైపు అభివృద్ధి చేస్తున్నారు. ఈ కల్వర్టువద్ద తిరిగి రోడ్డు కుంగిపోవడంతో తిరిగి వాహనదారులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. గతంలో ఇబ్బందిలేని మరో కల్వర్టు వినాయకుని గుడిప్రాంతంలో నూతనంగా నిర్మించగా ఈ కల్వర్టు కూడా ప్రస్తుతం కుంగిపోయింది. ఈ రెండుచోట్ల వాహనాలకు బ్రేకర్లు పెట్టి అదుపు చేస్తున్నారు. సామర్లకోట-పెద్దాపురం మధ్య అభివృద్ధి చేసిన రోడ్డులో కూడా ఒకచోట రోడ్డు నలిగిపోయి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ కుంగిపోయిన కల్వర్టులను మరమ్మతులు చేపట్టి వదిలేస్తే భవిష్కత్లో 40 నుంచి 50 టన్నుల వరకూ ఉండే భారీ వాహనాలు ప్రయాణిస్తే ఈ కల్వర్టుల పరిస్థితి ఏంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కుంగిపోయిన కల్వర్టులను తిరిగి నూతనంగా నిర్మించాలంటూ వాహనదారులు కోరుతున్నారు.