పట్టణ శుభ్రత ప్రజల చేతుల్లో
ABN , First Publish Date - 2020-02-28T10:49:35+05:30 IST
పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వ, అధికారులు కృషి చేస్తే సరిపోదని, ప్రజల్లో మార్పువస్తే వారి చైతన్యంతోనే పట్టణం పరిశుభ్రంగా మారుతుందని అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నా రు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
అక్రమ కట్టడాలకు తప్పదు ముల్యం
ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజావాణి
21 రోజుల్లో భవన నిర్మాణానికి అనుమతులు 8లేదంటే పనులు మొదలుపెట్టుకోవచ్చు
అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్
సిద్దిపేట సిటీ, ఫిబ్రవరి 27: పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వ, అధికారులు కృషి చేస్తే సరిపోదని, ప్రజల్లో మార్పువస్తే వారి చైతన్యంతోనే పట్టణం పరిశుభ్రంగా మారుతుందని అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నా రు. గురువారం సిద్దిపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మున్సిపల్ కమిషనర్ శ్రీనివా్సతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ని పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో మార్పు రాకపోతే అభివృద్ధి సాధించలేమన్నారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి, ప్లాస్టిక్కు వాడకుండా ఉన్నప్పుడే పట్టణాభివృద్ధి కళ సాకారం అవుతుందని ఆయన సూచించారు. చట్టవిరుద్ధమైన భవన నిర్మాణాలు చేపడితే మూడేళ్ల జైలు శిక్ష లేదా భవన నిర్మాణ విలువలో 25 శాతం జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. అయినా పనులు ఆపని పరిస్థితుల్లో 50 శాతం జరిమానాతో పాటు భవన కూల్చివేతకు అయ్యే ఖర్చును వసూలు చేస్తారని హెచ్చరించారు. భవన నిర్మాణానికి అనుమతిని 21 రోజుల్లో అందిస్తామని లేదంటే నిర్మాణ పనులు మొదలుపెట్టుకోవచ్చునని సూచించారు. త్వరలోనే టీఎస్- బీపాస్ చట్టం మన పట్టణంలో అమలు కాబోతుందన్నారు. మున్సిపల్ పరిధిలో కొత్తగా పబ్లిక్ మురుగుదొడ్లు ఏర్పాటుకు, వాటి శుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఇక నుంచి ప్రతిరోజు చెత్త సేకరణ వాహనాలు ప్రతి గల్లీలో తిరుగుతాయని, శుక్రవారం, ఆదివారం పొడి చెత్తను మిగతా రోజుల్లో తడిచెత్తను తీసుకెళ్తారని పట్టణ ప్రజలు ఖచ్చితంగా తడి, పొడి చెత్తలను వేరుచేసి ఇవ్వాలని కోరారు.
ఖాళీ స్థలంలో చెత్త వేస్తే జరిమానా
పట్టణం పరిశుభ్రంగా ఉండాలని అధికారులు, ప్రభుత్వం తీవ్రస్థాయిలో పనిచేస్తున్నారని, ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పట్టణంలో ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే ఉపేక్షించేది లేదని, ఆ స్థలం యాజమానికి, చుట్టుపక్కల వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండు, మూ డు రోజుల్లో పట్టణంలోని ప్రతి ఖాళీ స్థలం మున్సిపల్ బోర్డు పెట్టించునున్నట్లు తెలిపారు. ఆ స్థలం యాజమాను లు ముందుకు రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి సోమవారం పట్టణ ప్రజావాణి
పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజావాణి నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో పట్టణానికి చెందిన అందరూ అధికారులు హాజరవుతారని, పట్టణంలో ఎవరికి సమస్యలు ఉన్న ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు.