అదనపు కట్నం ఇవ్వలేదని...పెళ్లి నిరాకరించిన వరుడు
ABN , First Publish Date - 2021-03-10T18:08:49+05:30 IST
అదనపు కట్నం ఇవ్వలేదని ఓ వరుడు ముఖం చాటేయడంతో పెళ్లి నిలిచిపోయిన ఘటన పహాడిషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ ప్రభులింగం తెలిపిన ..
ఫంక్షన్హాల్కు రాని వైనం.. నిలిచిన పెళ్లి
హైదరాబాద్/పహాడిషరీఫ్: అదనపు కట్నం ఇవ్వలేదని ఓ వరుడు ముఖం చాటేయడంతో పెళ్లి నిలిచిపోయిన ఘటన పహాడిషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ ప్రభులింగం తెలిపిన కథనం ప్రకారం.. పహాడిషరీఫ్ అబుషేర్కాలనీ సాలియన్ మజీద్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ రహ్మాన్కు 8మంది సంతానం. ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె(19)ను జియాగూడకు చెందిన మహ్మద్ హాషమ్ కుమారుడు సయ్యద్ అజ్మద్(26)తో రెండు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. మార్చి 8న బండ్లగూడలోని మోయిన్ ఫంక్షన్ హాల్లో పెళ్లికి ఏర్పాట్లు చేయగా... పెళ్లికుమారుడు రాలేదు. పెళ్లి కూతురి తండ్రి రహ్మాన్ పెళ్లికుమారుడికి ఫోన్ చేశాడు. అదనపు కట్నం ఇస్తేనే పెళ్లికి వస్తానని, లేదంటే రానని చెప్పాడు. రాత్రి వరకు నిరీక్షించినా ఫోన్ ద్వారా బతిమాలినా రాకపోవడంతో పెళ్లికూతురుతో సహా బంధువులు ఇళ్లకు వెళ్లిపోయారు. పెళ్లికూతురు తండ్రి రహ్మాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.