ఈ సారైనా టీచర్ పోస్టులు భర్తీ అయ్యేనా! నాలుగేళ్లుగా లేని నియామకాలు
ABN , First Publish Date - 2022-01-17T20:02:54+05:30 IST
ఉపాధ్యాయులను జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ముగిసింది. ఖాళీ పోస్టుల విషయంలో ఒక స్పష్టత వచ్చింది
బదిలీలతో మార్గం సుగమం అయినట్లేనా!..
కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి
జిల్లాల వారీగా భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులు
20 వేలకు పైగా ఖాళీ ఉన్నట్లు అంచానా
నాలుగేళ్లుగా లేని ఉపాధ్యాయ నియామకాలు
టెట్నూ నిర్వహించక.. అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులను జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ముగిసింది. ఖాళీ పోస్టుల విషయంలో ఒక స్పష్టత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై, టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో గత నాలుగైదేళ్లుగా దాదాపు 5 లక్షల మంది బీఎడ్, డీఎడ్ పూర్తి చేసి.. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం టీఆర్టీపై రెండేళ్లుగా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. ప్రస్తుతం టీచర్ల బదిలీలతో అన్ని అవరోధాలు తొలగినట్లయింది. బదిలీల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు వెళ్లనున్నారు. మిగిలినవారు ఇప్పటివరకు పనిచేసిన స్థానాల్లోనే కొనసాగనున్నారు. అంటే.. గతంలోని ఖాళీలు అలాగే ఉండిపోనున్నాయి. ఉపాధ్యాయులను కొత్తగా కేటాయించిన జిల్లాల్లో కొన్ని ఖాళీలు తగ్గిపోనుండగా, ఏ జిల్లాల నుంచి టీచర్లను కేటాయించారో.. అక్కడ కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఒక జిల్లాలో ఉద్యోగం చేస్తూ మరో జిల్లాకు బదిలీ అయినవారిలో ఎక్కువ మంది 2017 టీఆర్టీ, 2012 డీఎ్ససీ ద్వారా ఉద్యోగాలు పొందినవారే ఉన్నారు. తాజాగా ఏర్పడ్డ ఖాళీలను కొత్త టీఆర్టీ ద్వారా.. 95 శాతం జిల్లా కోటాలో, 5 శాతం నాన్ లోకల్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. ప్రత్యేకించి 2017 టీఆర్టీ ద్వారా సింగిల్ టీచర్గా భర్తీ అయిన చాలా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ప్రస్తుతం వేరే జిల్లాలకు కేటాయించడంతో ఆయా చోట్ల ఖాళీలను తప్పక భర్తీ చేయాల్సి ఉంది.