ఉత్సాహంగా పొట్టేళ్ల పందేలు
ABN , First Publish Date - 2020-02-28T11:21:01+05:30 IST
మండల కేంద్రంలో భ్రమరాంబికా అడివేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల పెందేలు నిర్వహించారు.
మొదటి బహుమతి సాధించిన పుడిచెర్ల పొట్టేలు
కొనసాగుతున్న అడివేశ్వర స్వామి ఉత్సవాలు
రాజోలి, ఫిబ్రవరి 27 : మండల కేంద్రంలో భ్రమరాంబికా అడివేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల పెందేలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 14 పొట్టేళ్లు ఢీకొన్నాయి. పోటీల్లో పుడిచెర్ల గ్రామానికి చెందిన హిమవంతుకు సంబంధించిన పొట్టేలు మొదటి బహుమతిని కైవసం చేసుకోగా, రెండవ బహుమతిని పూలతోట గ్రామానికి చెందిన రామ్భూపాల్రెడ్డి పొట్టేలు కైవసం చేసుకున్నది. మూడవ బహుమతిని పగిడాల గ్రామానికి చెందిన వెంకటస్వామి కైవసం చేసుకున్నారు. వీరికి దాతలు గోనెగండ్ల రఫిక్, ఉప్పరి వెంకటన్న, గోనెగండ్ల రషీద్ చేతుల మీదుగా బహుమతులను గెలుపొందిన వారికి అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నాగేష్, ఉపసర్పంచు గోపాల్ పాల్గొన్నారు.
నేడు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు
రైతు సంబరాల్లో భాగంగా శుక్రవారం అంతర్రాష్ట్ర పాలపళ్ల ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ నాగేష్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతిగా రూ.30 వేలు వడ్డేపల్లి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు అందిస్తారని తెలిపారు. రెండవ బహుమతిగా రూ.25 వేలను రాజోలి సర్పంచు వెంకటేశ్వరమ్మ గోపాల్, మూడవ బహుమతి రూ.20 వేలను కుర్వ నాగన్న కుమారులు, మనవళ్లు అందిస్తారని తెలిపారు. నాలుగో బహుమతిగా రూ.15 వేలను దాత రాజోలి జడ్పీటీసీ సుగుణమ్మ మూగన్న, ఐదవ బహుమతి రూ.10 వేలను ఉప్పరి రంగస్వామి, ఆరవ బహుమతి రూ.5 వేలను జి.సలాం అందిస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రాజోలి మాజీ సర్పంచు మోచి హుసేన్ భజన బృందం సభ్యులను సన్మానించి, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు నాగేష్, గోపాల్ రెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు.