పట్టాభూముల జోలికొస్తే ఆత్మహత్యలే..
ABN , First Publish Date - 2020-09-25T07:02:29+05:30 IST
తమ పట్టాభూముల జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని పోలుకమ్మ చెరువు ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులతో బాధిత రైతుల వాగ్వాదం
వెళ్లిపోవాలని అధికారుల కాళ్లపై పడిన రైతులు
స్టేషన్ఘన్పూర్, సెప్టెంబరు 24: తమ పట్టాభూముల జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని పోలుకమ్మ చెరువు ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండలోని పోలుకమ్మ చెరువు వద్ద గురువారం బాధిత రైతు కుటుంబాలు పురుగు మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు అక్కెనపల్లి బాలరాజు, బండ సంపత్, లింగం, రాకేశ్ మాట్లాడారు. అనేక ఏళ్లుగా తమ పట్టా భూమిలో పంటలను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. కొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం చెరువులో ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయాలని తమ భూములను మింగేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
పోలుకమ్మ చెరువులో ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ ఈఈ శంకర్రావు, డీఈ అజార్, ఏఈ యాసర్, రెవెన్యూ అధికారులు ఆర్ఐలు కృపాకర్రెడ్డి, భగత్, సర్వేయర్ సురేందర్ రావడంతో బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకే హద్దులు ఏర్పాటు చేయడానికి వచ్చామని ఈఈ శంకర్రావు అన్నారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని.. లేదంటే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి చనిపోతాం’ అని తెలిపారు. తమ చావులకు కలెక్టర్, ఆర్డీవో, వైస్ ఎంపీపీ సుధీర్రెడ్డిలు బాధ్యత వహించాల్సి వస్తుందని అధికారులను అడ్డగించారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెళ్లిపోయారు. కార్యక్రమంలో రైతులు రాజయ్య, శ్రీను, వెంకటేశ్, రాఖేశ్ తదితరులు పాల్గొన్నారు.