‘ఇక్కడ జీవిత ఖైదు భరిస్తాం... అఫ్ఘానిస్థాన్‌ వెళ్లం’: ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘాన్ పౌరులు!

ABN , First Publish Date - 2021-08-17T12:54:06+05:30 IST

తాలిబన్ల ఆధీనంలోకి అఫ్ఘానిస్థాన్‌ వెళ్లిపోవడంతో...

‘ఇక్కడ జీవిత ఖైదు భరిస్తాం... అఫ్ఘానిస్థాన్‌ వెళ్లం’: ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘాన్ పౌరులు!

న్యూఢిల్లీ: తాలిబన్ల ఆధీనంలోకి అఫ్ఘానిస్థాన్‌ వెళ్లిపోవడంతో అఫ్ఘాన్ పౌరులు ప్రాణభయంతో ఢిల్లీకి చేరుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో దుర్బర పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో మన దేశానికి చేరుకున్న అక్కడి పౌరులు తిరిగి అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అక్రమంగానైనా భారత్‌లో ఉంటూ జీవితకాలం జైలు జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో జరుగుతున్న మారణకాండకు బలవుతున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులను తలచుకుని కుమిలిపోతున్నారు. 


అఫ్ఘాన్ పౌరుల వసతి కోసం భారత్ ఏర్పాట్లు చేస్తోంది. న్యూఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ లో గల కస్తూర్బా కాలనీలో ప్రస్తుతం అఫ్ఘాన్ పౌరులు తలదాచుకుంటున్నారు. దొరికినదేదో తింటూ కాలం గడుపుతున్నారు. వీరిలో చాలామంది కెమెరా కంటికి కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే ప్రాంతానికి పది రోజుల క్రితం చేరుకున్న ఇమ్రాన్ వజాహద్ మీడియాతో మాట్లాడుతూ తాలిబన్ల చేతిలో చిక్కిన అఫ్ఘానిస్థాన్‌‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, తాను తిరిగి అక్కడకు వెళ్లాలని అనుకోవడం లేదని, ఇక్కడే జీవితాంతం జైలులో గడిపేందుకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 


అయితే తనకు ఇంకా మూడు నెలల పాటు వీసా గడువు ఉన్నదని, అంతవరకూ ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇదేవిధంగా భార్యకు వైద్య చికిత్స అందించేందుకు భారత్ వచ్చిన ఆఫ్ఘాన్ పౌరుడు జమ్రాయీ మాట్లాడుతూ తనతో పాటు కుటుంబం అంతా ఇక్కడకు వచ్చిందని తెలిపారు. తాను అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, తాలిబన్ల అరాచకాలకు భయపడుతున్నానని, తిరిగి అక్కడికి వెళ్లాలనుకోవడం లేదని తెలిపారు. ఇదేవిధమైన సమస్యలో ఉన్న ఎహసానుల్లా మాట్లాడుతూ అక్కడకు తిరిగి వెళ్లి ఏం చేయాలని... వ్యాపారం కొనసాగించే అవకాశం లేదని, ఇంటిలో రక్షణ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-08-17T12:54:06+05:30 IST