పరమపదించి పాతికేళ్ళు దాటినా...

ABN , First Publish Date - 2021-01-19T07:26:35+05:30 IST

ఆయన పరమపదించి అక్షరాలా పాతికేళ్ళు దాటుతోంది... ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ సైతం అధికారంలో లేదు... అయితేనేం ఆ పార్టీ నేతలే కాదు మారుమూల గ్రామాల్లోని సామాన్య అభిమాన జనం సైతం ఆయన్ను ఇంకా మరచిపోలేదు...

పరమపదించి పాతికేళ్ళు దాటినా...
చిత్తూరులో రక్తదాన శిబిరం

అన్నను మరవని అభిమానజనం  - జిల్లావ్యాప్తంగా ఘన నివాళులు


తిరుపతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఆయన పరమపదించి అక్షరాలా పాతికేళ్ళు దాటుతోంది... ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ సైతం అధికారంలో లేదు... అయితేనేం ఆ పార్టీ నేతలే కాదు మారుమూల గ్రామాల్లోని సామాన్య అభిమాన జనం సైతం ఆయన్ను ఇంకా మరచిపోలేదు... ఆయనే ఆంధ్రుల ఆరాధ్య నటుడు, అసమాన రాజకీయ నేత ఎన్టీ రామారావు. జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఆయన వర్ధంతి వేడుకలే దానికి నిదర్శనం. జిల్లా కేంద్రం మొదలుకుని కుగ్రామాల వరకూ ప్రధాన కూడళ్ళలో ఎన్టీఆర్‌ విగ్రహాలు పూలమాలల్లో మునిగిపోయాయి. విగ్రహాలు లేని చోట్ల ఆయన చిత్రపటాలు కొలువు దీరాయి. పూలమాలలు వేసి కొందరు, భక్తిప్రపత్తులతో కొబ్బరికాయలు కొట్టి మరికొందరూ ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకోగా మరికొందరు ఆయన పేరిట పేదలకు, వృద్ధులకు, రోగులకు అన్నదానాలు చేయగా మరికొందరు మరింత సామాజిక బాధ్యతతో రక్తదానాలు సైతం చేశారు. తిరుపతి, రామసముద్రం, రేణిగుంట, కార్వేటినగరం, పుత్తూరులతో పాటు మదనపల్లె నియోజకవర్గంలో పలుచోట్ల అన్నదానాలు చేయగా మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలోనూ, తిరుపతి, కలకడ, పుత్తూరు, సత్యవేడుల్లో రక్తదానాలు చేశారు. సత్యవేడు శిబిరంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కలకడలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌ స్వయంగా రక్తదానం చేశారు. సోమలలో శంఖం పూరిస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో వున్న ఎన్టీఆర్‌ చిత్రపటానికి అర్చకుడితో పూజలు నిర్వహించగా, పుంగనూరులో పెద్దసంఖ్యలో కార్యకర్తలు వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. కేవీపల్లెలో కార్యకర్తలు పోటాపోటీగా కొబ్బరికాయలు కొట్టగా ఎస్వీయూ, పద్మావతీ వర్శిటీలలో విద్యార్థులు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో బైక్‌ ర్యాలీ చేపట్టగా కార్వేటినగరం పీహెచ్‌సీలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు.మదనపల్లెలో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు భారీ ఎత్తున వర్ధంతి వేడుకలు నిర్వహించారు.





Updated Date - 2021-01-19T07:26:35+05:30 IST