తండ్రిని చంపి పారిపోతుంటే... విధి ఇలా వెంటాడింది..!

ABN , First Publish Date - 2021-12-07T18:07:41+05:30 IST

తండ్రిని చంపేశాడు.. ఇక తనను ఎవరూ పట్టుకోనంత దూరం వెళ్లిపోవాలని ప్రయత్నించాడు.. చివరికి..

తండ్రిని చంపి పారిపోతుంటే... విధి ఇలా వెంటాడింది..!

లక్నో/బరేలీ : తండ్రిని చంపేశాడు.. ఇక తనను ఎవరూ పట్టుకోనంత దూరం వెళ్లిపోవాలని ప్రయత్నించాడు.. చివరికి అతన్ని విధి వెంటాడి.. తండ్రి దగ్గరికే పంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. బుద్‌సేన్ (55) అనే హోంగార్డుకు ముగ్గురు కుమారులు. ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంతలో ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరిగింది. చిన్న కుమారుడు నెక్‌పాల్ ఆస్తి వాటా విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. తనకు ఎక్కువగా ఆస్తి ఇవ్వకపోవడంతో తండ్రిపై కోపం పెంచుకుని.. హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి ‘నా తండ్రిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు సార్..’ అని చెప్పాడు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే నెక్‌పాల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అసలేం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. అప్పుడే అసలు విషయం తెలిసింది.


అటు తండ్రి.. ఇటు కుమారుడు..!

ఫోన్ చేసిన నెక్‌పాల్ ఎక్కడున్నాడు..? ఎక్కడికెళ్లాడు..? అతనే చంపేశాడా..? అని పోలీసులు వెతకడం ప్రారంభించారు. నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో నెక్‌పాల్ మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నెక్‌పాల్ మృతదేహమని నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం తండ్రి, కుమారుడి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన రాంపూర్ ఎస్పీ అంకిత్ మిట్టల్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.


ఇదీ అసలు కథ...

బుద్‌సేన్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులరాంపూర్ జిల్లాలోని షహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్‌పూర్ మజ్రా గ్రామంలో వీరు నివాసం ఉంటున్నారు. ఆస్తి పంపకాల విషయంలో తండ్రి.. పెద్ద కుమారుడైన ఓం ప్రకాష్‌కు ఎక్కువగా ఇచ్చాడు. దీంతో చిన్నకుమారుడైన నెక్‌పాల్‌ తండ్రిపైన కోపం పెంచుకున్నాడు. తనకు అన్యాయం చేశాడని భావించిన నెక్‌పాల్‌.. తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెక్‌పాల్ మరణించాడు. అయితే.. అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా..? లేకుంటే తండ్రిని చంపి తప్పు చేశానని భావించి వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా..?  అనేది నిర్ధారించాల్సి ఉందిఅని ఎస్పీ అంకిత్ మిట్టల్ మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2021-12-07T18:07:41+05:30 IST