స్నేహామంటే ఇదే.. ఏడాదిన్నర క్రితం మరణించిన ఫ్రెండ్ ఫ్యామిలీకి నెల నెలా డబ్బులిస్తూ.. ఇల్లు కూడా కట్టిచ్చారు..!

ABN , First Publish Date - 2021-08-03T16:22:42+05:30 IST

ఝార్ఖండ్‌లోని గొడ్డాకు చెందిన వీరి గురించి తెలుసుకుంటే స్నేహమంటే ఇది కదా! అనిపిస్తుంది.

స్నేహామంటే ఇదే.. ఏడాదిన్నర క్రితం మరణించిన ఫ్రెండ్ ఫ్యామిలీకి నెల నెలా డబ్బులిస్తూ.. ఇల్లు కూడా కట్టిచ్చారు..!

ఝార్ఖండ్‌లోని గొడ్డాకు చెందిన వీరి గురించి తెలుసుకుంటే స్నేహమంటే ఇది కదా! అనిపిస్తుంది. ఇలాంటి స్నేహితులుంటే చాలు అనిపిస్తుంది. ఏడాదిన్నర క్రితం చనిపోయిన స్నేహితుడి కుటుంబానికి వారందరూ అండగా నిలిచారు. ఆ కుటుంబానికి ఏకంగా ఇల్లు నిర్మించి ఇచ్చారు. ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వీరి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


గొడ్డాకు చెందిన ఫొటోగ్రాఫర్ వీరేంద్ర కుమార్ 2019 డిసెంబర్ 22న ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతనికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరేంద్ర చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. వారిని ఆదుకునేందుకు వీరేంద్ర చిన్ననాటి స్నేహితులు 40 మంది ముందుకొచ్చారు. అందరూ కలిసి డబ్బులు వేసుకుని రూ.7 లక్షలతో వీరేంద్ర కుటుంబానికి ఇల్లు సమకూర్చారు. ఇటీవలె గృహప్రవేశం కూడా చేయించారు. అలాగే ప్రతినెల వారి పోషణార్థం రూ.15 వేలు పంపుతున్నారు. 


`వీరేంద్ర లాంటి స్నేహితుడిని కోల్పోవడం మాకు తీరని లోటు. అతను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. మాలో చాలా మందిని వీరేంద్ర గతంలో ఎన్నోసార్లు ఆదుకున్నాడు. స్వంత కుటుంబం కోసం చూసుకోకుండా అవసరంలో ఉన్న స్నేహితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చేవాడు. అతని రుణం తీర్చుకునేందుకే మేం అతని కుటుంబానికి అండగా నిలిచామ`ని స్నేహితులు చెప్పారు. 

Updated Date - 2021-08-03T16:22:42+05:30 IST