కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు మళ్లీ ప్రశ్నల వర్షం.. కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-05-17T19:16:47+05:30 IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది.

కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు మళ్లీ ప్రశ్నల వర్షం.. కీలక ఆదేశాలు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో లాగా తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడం లేదు..? అని కోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్స్ కోర్టుకు తెలిపారు. బెడ్స్ సామర్థ్యంపై వెబ్‌సైట్‌లా ఒకలా.. గ్రౌండ్ లెవల్‌లో మరోలా ఉందేం..? అని హైకోర్టు మండిపడింది. 


హైకోర్టు సీరియస్..

మరోవైపు.. ప్రైవేటు అస్పత్రుల దోపిడీపై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా మొదటి దశలో ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలపై ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.. కానీ రెండో దశలో కరోనా తీవ్రంగా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు తెసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో్ సిటిస్కాన్, ఇతర టెస్టులకు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని టీఎస్ హైకోర్టు అభిప్రాయపడింది. కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.



వేతనాల సంగతేంటి..?

చాలా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహించే సిబ్బందికి వేతనాలు ఎందుకు చెల్లించడం లేదు..?. ఇలాంటి సమయంలో వారు ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తుంటే వారికి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదు..?’ అని ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అదే విధంగా ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్‌లు ఎన్జీఓలతో ఒప్పందం చేసుకుని కమ్యునిటి కిచెన్‌లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ కిచెన్ వివరాలు పొందుపరచాలిఅని హైకోర్టు సూచించింది.


కరోనా వారియర్లుగా గుర్తించండి..

వాక్సినేషన్‌కు సంబందించిన పూర్తి వివరాలు సమర్పించాలి. సీనియర్ సిటిజన్‌లు, పేద వారికి వాక్సినేషన్ కోసం ఎన్జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వాక్సినేషన్ పెట్టండి. ఎలక్షన్ డ్యూటీలో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారు. 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఎలక్షన్ డ్యూటీలో ఉంది కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలి. వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందించాలిఅని కేసీఆర్ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-05-17T19:16:47+05:30 IST