మళ్లీ ఉద్యోగుల ఉద్యమం
ABN , First Publish Date - 2022-01-23T06:12:11+05:30 IST
జిల్లాలో ఉద్యోగులు మళ్లీ ఉద్యమబాట పడుతున్నారు. రాష్ట్రస్థాయి ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్ర సంఘాల నిర్ణయానికి అనుగుణంగా సమాయత్తం
నేడు ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం
పక్షం రోజులు దశలవారీ కార్యక్రమాలు... అనంతరం సమ్మె
ఒంగోలు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉద్యోగులు మళ్లీ ఉద్యమబాట పడుతున్నారు. రాష్ట్రస్థాయి ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా ఎన్జీవో అసోసియేషన్ నేతృత్వంలోని జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్ నేతృత్వంలో జేఏసీ అమరావతితోపాటు ఇతర సంఽఘాలు... మరో ప్రధాన వర్గంగా ఉపాధ్యాయు లోకం ఉంది. వీరితోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా కలిసి జిల్లాలో దాదాపు 50వేల మంది వరకు పనిచేస్తున్నారు. దీంతో వారిని చైతన్యపరిచి ఉద్యమం విజయవంతం చేసే దిశగా ఆయా సంఘాల నేతలు దృష్టిసారించారు. అందులోభాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఎన్జీవో భవన్లో రౌండ్టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. అనంతరం ఈనెల 25న జిల్లాకేంద్రంలో ధర్నా, 26న అంబేడ్కర్ విగ్రహాలకు విజ్ఞాపనలు, 27 నుంచి 30 వరకు రిలే దీక్షలు చేయాలని ఇప్పటికే రాష్ట్రస్థాయిలో పోరాట కార్యక్రమాన్ని ప్రకటించారు. దానిపై ఆదివారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్నారు.