Agnipath scheme వెనక్కి తీసుకోవాల్సిందే: ప్రతిపక్షాలు
ABN , First Publish Date - 2022-07-11T23:00:45+05:30 IST
న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్ వెనక్కు తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన రక్షణ రంగ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ: Agnipath scheme వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన రక్షణ రంగ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్ చేశాయి. రాజ్నాథ్ను కలిసిన వారిలో టీఎంసీకి చెందిన సుదీప్ బంధోపాధ్యాయ్, సౌగతారాయ్, ఎన్సీపీకి చెందిన రజ్నీ పాటిల్, కాంగ్రెస్ పార్టీకి చెందిన శక్తిసింగ్ గోహిల్, ఆర్జేడీకి చెందిన ఏడీ సింగ్, బీజేపీకి చెందిన రంజన్బెన్ భట్ రామ్భాయ్ మొఖారియా ఉన్నారు. అగ్నిపథ్ స్కీమ్పై లోతుగా చర్చించారు. స్కీమ్ను వెనక్కు తీసుకోవడం లేదా పార్లమెంట్ పరిశీలనకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కోరారు. అగ్నిపథ్ స్కీమ్ ఉద్యోగాల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయంటే ఎక్కువ నిరుద్యోగిత ఉందని అర్థమని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. సమావేశంలో ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ త్రివిధదళాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Agnipath scheme ద్వారా దేశ రక్షణలో యువశక్తి భాగస్వామ్యం పెరుగుతుందని, తద్వారా భారత సైన్యం మరింత శక్తిమంతమవుతుందని కేంద్రం చెబుతోంది. అగ్నిపథ్ పథకంలో చేరిన వారిని ‘అగ్నివీరులు’ అని పిలుస్తారు. ఈ పథకం ప్రకారం– పదో తరగతి లేదా ఇంటరు పూర్తి చేసినవారికి, సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాకా, దేశానికి నాలుగేళ్ల పాటు సేవ చేసే అవకాశం దక్కుతుంది. నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ పొందిన ఈ ‘అగ్నివీరుల’ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం అందించే, పన్ను చెల్లించనవసరం లేని రూ.11,71,000 డబ్బుకు తోడు, ఏదైనా పరిశ్రమ ఏర్పాటుకైనా, లేదా ఇతరత్రా ఉపాధికైనా బ్యాంకుల నుంచి సులభమైన ఋణ సౌకర్యం కూడా ఉంటుందని కేంద్రం తెలిపింది.