వ్యవసాయ క్షేత్రంలో.. కళాసేద్యం!
ABN , First Publish Date - 2021-10-18T04:59:33+05:30 IST
నమ్ముకున్న పనిని కళాత్మకంగా చేస్తున్నాడీ యువకుడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ప్రయోగాలు చేస్తున్నాడు.
వరి నారులో ప్యాడీ ఆర్ట్
తీర్చిదిద్దిన రైతు బాపారావు
సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు..
కొల్లిపర, అక్టోబరు17: నమ్ముకున్న పనిని కళాత్మకంగా చేస్తున్నాడీ యువకుడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ప్రయోగాలు చేస్తున్నాడు. కొల్లిపర మండలం అత్తోటకు చెందిన యర్రు బాపారావు గ్రాఫిక్ డిజైనింగ్లో పీజీ చేశాడు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయ బాటపట్టాడు. ప్రకృతి వ్యవసాయ సాగులో ఇప్పటికే గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో జపాన వ్యవసాయ క్షేత్రాల్లో ప్యాడీఆర్ట్ అతనిని ఆకట్టుకుంది. అదే తరహాలో తాను సాగు చేస్తున్న పొలంలో కళాకృతులను తీర్చిదిద్దుతున్నాడు. గతంలో వరినాట్ల సమయంలో వరినారుతో గోవింద నామాలు తీర్చిదిద్ది శ్రీవేంకటేశ్వరునిపై తన భక్తిప్రవత్తులను కళాత్మకంగా చాటుకున్నాడు. ఈ సారి కనకదుర్గమ్మ అమ్మవారిని తీర్చిదిద్డాడు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ నూలు వడికే ఆకృతిని వ్యవసాయ క్షేత్రంలో రూపొందించాడు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించే లక్ష్యంగా బాపారావు చేస్తున్న కృషిని పలువురు రైతులు అభినందిస్తున్నారు. జపానలో సెప్టెంబరు నుంచి నవంబరు వరకు వ్యవసాయ క్షేత్రాలను కళాత్మక ప్యాడీ ఆర్ట్తో అలరిస్తారని బాపారావు తెలిపాడు. ఆ తరహాలోనే అత్తోట గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో తీర్చిదిద్దాదని అన్నారు. రైతులకు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశాడు.