పంట నష్టంపై 10 రోజుల్లో సర్వే పూర్తి
ABN , First Publish Date - 2020-12-04T06:05:59+05:30 IST
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, ఇతర పంటలకు వాటిల్లిన నష్టంపై డిసెంబరు 10వ తేదీనాటికి సర్వేను పూర్తిచేసి, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు.
కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక
వ్యవసాయ శాఖ జేడీ లీలావతి
పాయకరావుపేట రూరల్, డిసెంబరు 3: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, ఇతర పంటలకు వాటిల్లిన నష్టంపై డిసెంబరు 10వ తేదీనాటికి సర్వేను పూర్తిచేసి, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు. మండలంలోని పాల్తేరులో నీటి మునిగిన వరిపైరును పరిశీలించడానికి కేంద్ర బృందం వెంట వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పంట నష్టం వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులెవరికీ అన్యాయం జరగదని చెప్పారు. ప్రభుత్వానికి నివేదించిన అనంతరం పంట నష్టపోయిన రైతుల జాబితాలను ఆర్బీకేల్లో ఉంచుతామని తెలిపారు. ఒకవేళ పంట నష్టపోయిన రైతుల పేర్లు జాబితాలో లేకపోతే సమీపంలోని వీఏవోకు చెప్పి నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.