నాయీ బ్రాహ్మణుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం: దాసోజు
ABN , First Publish Date - 2021-09-11T23:39:24+05:30 IST
నాయీ బ్రాహ్మణుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం: దాసోజు
హైదరాబాద్: నాయీ బ్రాహ్మణుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ అన్నారు. గాంధీభవన్లో నాయీ బ్రాహ్మణ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ ‘‘నాయీ బ్రాహ్మణులకు జుట్టు కత్తిరించడమే కాదు అవసరమైతే టీఆర్ఎస్ తోకలు కత్తిరించడమూ తెలుసు. గెడ్డం గీయడమే కాదు.. మోసం చేసిన కేసీఆర్ సర్కార్కి గుండుకొట్టి గద్దె దించడమూ తెలుసు. ఎన్నికల ముందు కేసీఆర్ ఓట్ల కోసం నాయీ బ్రాహ్మణులకు చాలా వాగ్దానాలు ఇచ్చారు. తీరా గెలిచాక నిలువునా మోసం చేశారు. 30వేల మోడ్రన్ సెలూన్లు, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నాయీ బ్రహ్మణులకు ఒక ఎమ్మెల్సీ పదవి , బడ్జెట్లో రూ. 250 కోట్లు వెంటనే కేటాయించాలి.’’ అని డిమాండ్ చేశారు.
52 శాతం ఉన్న బీసీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో పెద్ద ఎత్తున బాగామయ్యారని దాసోజు శ్రావణ్ గుర్తు చేశారు. చాలా మంది ఆత్మ బలిదానాలు చేశారని చెప్పారు. కానీ నేడు త్యాగాలు ఒకరివి. బోగాలు మరొకరికి అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలు అంటే కేసీఆర్కి ఎందుకు అంత చిన్న చూపన్నారు. బీసీలు ఏం పాపం చేశారని దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు.