ఆక్వాకు ఊరట
ABN , First Publish Date - 2021-05-08T06:13:56+05:30 IST
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమలు చేస్తున్న పాక్షిక లాక్డౌన్ నేపథ్యంలో ఆక్వా రంగానికి కొన్ని మినహాయింపులు ఇస్తూ వచ్చారు.
భీమవరం, మే 7 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమలు చేస్తున్న పాక్షిక లాక్డౌన్ నేపథ్యంలో ఆక్వా రంగానికి కొన్ని మినహాయింపులు ఇస్తూ వచ్చారు. ఆక్వా పేరు చెప్పేసరికి గతేడాది కరోనా వేళ విదేశాలకు రొయ్యల ఎగుమతులు, దేశీయంగా చేపల ఎగుమతులపై ప్రభావం చూపించింది. ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆక్వా రైతులు ఈ రంగంపై ఆధారపడిన వారు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ రెండో దశలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీ పుడ్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మత్స్యశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ పూనం మాల కొండయ్య కొన్ని ఉత్తర్వులను, కొన్ని మినహాయింపులను జారీచేశారు. వేసవి పరిస్థితులతో రైతులు తమ చెరువు వద్దకు వెళ్లి సాగు నిర్వహణకు, అవసరమైన యంత్ర సామగ్రి, మేత తెచ్చుకునే అవకాశం ఇచ్చారు. కూలీలను, పట్టుబడి సమయంలో ఐస్ తెచ్చుకోవచ్చు. హేచరీల నుంచి రొయ్యల సీడు తెచ్చుకునేందుకు, ఆక్వా ఉత్పత్తులు అమ్ముకోవడానికి, పట్టుబడులకు, ప్రాసెసింగ్ యూనిట్ల తరలింపునకు అనుమతించారు. ప్రాసెసింగ్ యూనిట్లో ఉద్యోగులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలి. సీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిత్యావసర విభాగంలో చేర్చడం, ఈ యూనిట్లలో 50 శాతం మందిని విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవ డం, కార్మికులను తీసుకు రావడానికి అవసరమైన రవాణాను అనుమతించడం వంటి మినహాయింపులు కల్పించారు.
ఈ ధ్రువీకరణలు చూపిస్తే ఓకే..
అయితే పై ప్రక్రియలో కొన్ని ధ్రువీకరణను రైతులు కాని ప్రాసెసింగ్ వారు చూపించాల్సి ఉంటుంది. సంబంధి త రైతులకు మత్స్యశాఖ కాని, కోస్టల్ ఆక్వా కల్చర్ అథా రిటీ జారీ చేసిన అనుమతి పత్రం, ఆధార్ కార్డు ఇతర ఏదైనా గుర్తింపు కార్డులు చూపవచ్చు. ఆక్వా వాహనాల ముందు ఆక్వా ట్రాన్స్పోర్టు వాహనం అని అంటించాలి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఫార్మా రిజిస్ట్రేషన్, అనుమతి పత్రాలు వంటి ధ్రువీకరణలు చూపించాలి. వీటిని చూసి పోలీస్ శాఖ, తనిఖీ అధికారులు ఎటువంటి అవరోధం కల్పించకూడదని ఉత్తర్వులలో పేర్కొన్నారు.