వెనక్కు తగ్గిన ఏపీ సర్కార్..!

ABN , First Publish Date - 2021-11-03T14:45:35+05:30 IST

సర్కారు వెనక్కు తగ్గింది..

వెనక్కు తగ్గిన ఏపీ సర్కార్..!

ఎయిడెడ్‌పై వెనక్కి

విలీనంపై నిర్ణయం ఉపసంహరించుకోవచ్చు 

విద్యాసంస్థలు యథాతథంగా నడుపుకోవచ్చు 

ఇందులో ఎలాంటి బలవంతం లేదు 

ఎయిడెడ్‌కు ప్రభుత్వం వ్యతిరేకం కాదు 

అధికారులతో సమావేశంలో సీఎం జగన్‌ 


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కారు వెనక్కు తగ్గింది. విలీనానికి అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విషయం స్పష్టం చేశారు. ‘ప్రభుత్వంలో విలీనానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు’ అని సీఎం పేర్కొన్నారు. ‘ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరం. దీంట్లో రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరం’ అని ఆయన అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.


‘ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించాం. గతంలో డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నవారు చారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో వాటిని నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఇంకోవైపు ప్రభుత్వాలు కూడా గడిచిన 20-25 ఏళ్లుగా ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో అవీ కరిగిపోతూ వచ్చాయి. ఒక విధాన నిర్ణయంలో భాగంగా ఇది చేశాయి. దీనివల్ల యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చింది’ అని జగన్‌ వివరించారు.


‘ఈ దశలో ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలను నడపడానికి మళ్లీమళ్లీ డబ్బులు పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ విద్యాసంస్థలను నడిపేందుకు యాజమాన్యంలోని వ్యక్తులు సమయం కేటాయించలేకపోతున్నారు. సంస్థ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్‌ సూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు’ అని జగన్‌ చెప్పారు.


‘ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలకు సహాయకారిగా ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలు కల్పించింది. విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తే... నాడు-నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం ఇది’’ అని సీఎం పేర్కొన్నారు.


‘‘తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలన్న ఎయిడెడ్‌ టీచర్ల వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. వారిని సరెండర్‌ చేసి ప్రైవేటుగా నడుపుకోవచ్చు. లేదా ఇప్పుడు ఉన్నట్టుగా యథాప్రకారం నడుపుకోవచ్చు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలని, మెరుగైన స్కూళ్లుగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే కల్పించిన ఈ అవకాశాలను వారు ఐచ్ఛికంగానే వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-03T14:45:35+05:30 IST