ఆధునిక వైద్యరంగానికి ఎయిమ్స్ కేంద్ర బిందువు: బండారు దత్తాత్రేయ
ABN , First Publish Date - 2021-10-02T01:37:58+05:30 IST
ఆధునిక వైద్యరంగానికి ఎయిమ్స్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు.
యాదాద్రి: ఆధునిక వైద్యరంగానికి ఎయిమ్స్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అకాడమీ సెక్షన్ను గవర్నర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎయిమ్స్ 200 ఎకరాల్లో రూ.788కోట్లతో అన్ని ఆధునిక హంగులతో వైద్యపరంగా ఆణిముత్యంలా నిలుస్తుందన్నారు. 2003లో నాటి ప్రధాని అటల్బిహారీ వాజపేయి దూరదృష్టితో స్వస్థ సురక్ష యోజన పథకం కింద ఎయిమ్స్ కళాశాలను ప్రకటించారని తెలిపారు. కొవిడ్-19 సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలవద్ద డబ్బుల్లేక ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడ్డారని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. వైద్యరంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధానిమిస్తోందని, బడ్జెట్లో రూ.2.04లక్షల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా గతంలో ఎనిమిది ఎయిమ్స్ వైద్యశాలలే ఉన్నాయని, ప్రస్తుతం 25వరకు పెంచారని దత్తాత్రేయ తెలిపారు.