ఒమిక్రాన్ నేపధ్యంలో... విమాన చార్జీలకు రెక్కలు...

ABN , First Publish Date - 2021-12-06T00:00:17+05:30 IST

ఒమిక్రాన్ నేపధ్యంలో... విమాన చార్జీలకు రెక్కలు...

ఒమిక్రాన్ నేపధ్యంలో... విమాన చార్జీలకు రెక్కలు...

ముంబై : కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో... విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. నవంబరు 24 న వెలుగు చూసిన ఈ వేరియంట్... కేవలం పది రోజుల వ్యవధిలోనే  38 దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... పలు దేశాలు మళ్లీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో... విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పరిస్థితి మరీ విషమిస్తే ఇక ప్రయాణం సాధ్యపడదని ప్రయాణికులు భావిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి.  ప్రయాణ ఆంక్షలు కఠినతరం కాకముందే... గమ్య స్థానాలకు చేరిపోవాలనే ఉద్దేశంతో డబ్బుకు వెనుకాడకుండా పెద్దసంఖ్యలో ప్రయాణికులు... టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అదే సమయంలో క్రిస్మస్ సీజన్ కావడం కూడా విమాన చార్జీలు భారీగా పెరగడానికి కారణమైంది. ప్రత్యేకించి... ఒమైక్రాన్ మరింత పెరిగితే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను దేశాలు తప్పనిసరి చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలకు డిమాండ్ పెరిగిపోయి, విమాన టికెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే... భారత్ నుంచి అధిక రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడాలకు విమాన చార్జీలు రెండింతలయ్యాయి.  


జో బైడెన్ ఆంక్షలు... మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిబంధనలు కఠినతరం చేశారు. వచ్చేవారం నుంచి అమెరికాలో అడుగుపెట్టాలనుకునేవారు... తమ ప్రయాణానికి 24 గంటల ముందు కోవిడ్ పరీక్ష  చేయించుకుని, నెగటివ్ రిపోర్ట్‌తో రావాల్సిందేనని పేర్కొన్నారు. రెండు డోసుల వ్యాక్సీన్ పూర్తైనవారు కూడా టెస్ట్ నెగటివ్ రిపోర్ట్‌ ఉంటేనే అమెరికాకు రావాలని నిబంధన విధించారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నవారైతే అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇక... విమానాలు, రైళ్లు, బస్సుల్లో మాస్కుధారణ తప్పనిసరి.. మార్చి వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కాగా... ఇప్పటికైతే ఒమైక్రాన్ అంతగా తీవ్రమైనది కాదని సింగపూర్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త వేరియంట్ల లక్షణాలు పాత వేరియంట్లకు భిన్నంగా లేవని తెలిపింది. అలాగే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ  లభించలేదని వెల్లడించింది. కట్టుదిట్టమైన చర్యలతో కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టవచ్చని సింగపూర్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. బూస్టర్ డోసులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-12-06T00:00:17+05:30 IST