కరోనా నుంచి కాపాడడమే మేం చేసిన తప్పా?: ఎయిరిండియా ఫైర్

ABN , First Publish Date - 2020-03-23T18:04:41+05:30 IST

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ఎయిరిండియా సిబ్బందికి సైతం ఇబ్బందులు..,

కరోనా నుంచి కాపాడడమే మేం చేసిన తప్పా?: ఎయిరిండియా ఫైర్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ఎయిరిండియా సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు.  కరోనా ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన సిబ్బందిని తిరిగి రానివ్వకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు అడ్డుకోవడమే దీనికి కారణం. దీనిపై ఎయిరిండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇలా అడ్డుకోవడం వారిని అవమానించమేనని పేర్కొంది. ‘‘చాలా చోట్ల రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు సంబంధించిన విజిలెంట్లు, పొరుగిళ్ల వారు విమాన సిబ్బందిని బహిష్కరించడం, విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం, పోలీసులను పిలిపించడం మొదలుపెట్టారు. తమ విధి నిర్వహణ కోసం విదేశాలకు వెళ్లిరావడమే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయం. కానీ ఈ విజిలెంట్లు ఓ విషయం మర్చిపోతున్నారు. వారికి సంబంధించిన జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పిల్లలు, సమీప బంధువులు, సన్నిహితులను కరోనా ప్రభావిత దేశాల నుంచి విమాన సిబ్బంది భద్రంగా, సురక్షితంగా తీసుకొచ్చారు. ఇందుకోసం ఎయిరిండియా సిబ్బంది చేసిన వీరోచిత ప్రయత్నాలకు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి...’’ అని ఎయరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. 


కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న అనేక మంది భారతీయులు, ప్రత్యేకించి విద్యార్ధులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఎయరిండియా తీవ్రంగా కృషిచేస్తోంది. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ చైనాలోని వుహాన్, జపాన్, మిలాన్, రోమ్, ఇరాన్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున భారతీయులను స్వదేశానికి తరలించింది. ‘‘కోవిడ్-19 ప్రభావిత దేశాలకు విమానాలను పంపిన ప్రతిసారీ సిబ్బంది క్షేమం కోసం, వారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఎయరిండియా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు వైరస్ సోకకుండా అవసరమైన అన్ని ప్రమాణాలను పాటిస్తోంది...’’ అని ఎయిరిండియా స్పష్టం చేసింది.


కాగా ఈ విషయమై జనవరిలోనే ఎయిరిండియా మెడికల్ విభాగం తమ సిబ్బందికి, ఆపరేషనల్ స్టాఫ్‌కి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. విమాన సిబ్బంది తమను తాము కాపాడుకుంటూనే ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలన్న దానిపై సవివరంగా ప్రోటోకాల్ అమల్లోకి తెచ్చింది. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి భారతీయులను తరలించే సందర్భంగా... సిబ్బందితో పాటు, ప్రయాణికులకు సరిపడా హ్యాండ్ శానిటైజర్లు, గ్లోవ్స్, మాస్కులను అందుబాటులో ఉంచింది. కాగా ప్రోటోకాల్‌లో భాగంగా విదేశాలకు విధి నిర్వహణ కోసం వెళ్లి వచ్చిన సిబ్బందిని హోం క్వారంటైన్‌‌కు పంపడంతో పాటు గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో పరీక్షలు సైతం చేయిస్తున్నట్టు ఎయరిండియా తెలిపింది. దేశ పౌరులు ప్రత్యేకించి అధికారులు ఎయిరిండియా సిబ్బందితో మర్యాదగా వ్యవహరించాలనీ...  వారికి దక్కాల్సిన స్వేచ్ఛా, గౌరవాలకు ఇబ్బంది కలగనివ్వరాదని సదరు ప్రభుత్వ విమానయాన సంస్థ విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2020-03-23T18:04:41+05:30 IST