రెండు నెలల్లో ఎయిర్లైన్స్ దివాలా!
ABN , First Publish Date - 2020-03-17T07:20:38+05:30 IST
కరోనా విజృంభణతో ప్రపంచంలోని చాలా ఎయిర్లైన్స్ మే చివరినాటికి దివాలా తీయవచ్చని సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) హెచ్చరించింది. ప్రభుత్వం, ఇండస్ట్రీ పరస్పర సహకారంతో...
కాపా హెచ్చరిక
న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ప్రపంచంలోని చాలా ఎయిర్లైన్స్ మే చివరినాటికి దివాలా తీయవచ్చని సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) హెచ్చరించింది. ప్రభుత్వం, ఇండస్ట్రీ పరస్పర సహకారంతో వెంటనే చర్యలు చేపడితేనే ఈ విపత్తును నివారించగలమని ఈ అంతర్జాతీయ విమాన కన్సల్టింగ్ సేవల సంస్థ అంటోంది. కరోనా వైరస్ వేగం గా వ్యాప్తి చెందుతుండటంతో చాలా దేశాలు ప్రజల ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించాయి. దేశీయంగానూ విమానయాన సేవలకు డిమాండ్ అనూహ్యంగా తగ్గింది. దాంతో ఎయిర్లైన్స్ తమ సేవలతోపాటు టికెట్ చార్జీలనూ భారీగా తగ్గించుకున్నాయి. వ్యయ నియంత్రణ చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ చాలా విమాన సంస్థలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నాయి.
దేశీయ ఎయిర్ ట్రాఫిక్ 50 శాతం డౌన్
ఈ ఏడాది జూన్ వరకు దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ 50 శాతం వరకు తగ్గవచ్చని అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసిం ది. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలను విధించారు. విదేశీయులెవ్వరూ మన గడ్డపై అడుగు పెట్టకుండా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. విదేశీయులకు వీసాలను ఏప్రిల్ 15 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఈనెల 12న ప్రకటించింది.
స్కూట్ కస్టమర్లకు ఓచర్ రిఫండ్
మే 31లోపు ప్రయాణం కోసం ఈ నెల 15న, అంతకు ముందు టికెట్ బుక్ చేసుకున్నవారికి ఓచర్ల రూపంలో పూర్తి సొమ్మును రిఫండ్ చేయనున్నట్లు స్కూట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. 12 నెలల పాటు చెల్లుబాటయ్యే ఈ ఓచర్లతో తిరిగి టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్లైన్స్ తెలిపింది.
అన్ని దేశాలు కలిసి స్పందించాలి: ఐఎంఎఫ్
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సమన్వయంతో ఆర్థిక చర్యల ను చేపట్టాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎం ఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. కరోనా వైర స్తో ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు వినియోగదారుల కొనుగోలు శక్తిని అమితంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.