షేర్హోల్డర్ల ఖాతాల్లోకి ఎయిర్టెల్
ABN , First Publish Date - 2021-10-06T01:55:32+05:30 IST
భారతీ ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూ నేటి (అక్టోబర్ 5) నుంచి ప్రారంభమైంది. సునీల్ మిత్తల్ సారథ్యంలోని ఈ టెల్కో... ప్రభుత్వ బకాయిలను తీర్చడానికి, తద్వారా రుణభారాన్ని తగ్గించుకోవడానికి, 4జీ నెట్వర్క్ విస్తరణకు, నెక్స్ట్జెన్ టెక్నాలజీ 5జీ వేలంలో పాల్గొనడానికి రైట్స్ ఇష్యూ డబ్బును ఉపయోగించనుంది.
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూ నేటి (అక్టోబర్ 5) నుంచి ప్రారంభమైంది. సునీల్ మిత్తల్ సారథ్యంలోని ఈ టెల్కో... ప్రభుత్వ బకాయిలను తీర్చడానికి, తద్వారా రుణభారాన్ని తగ్గించుకోవడానికి, 4జీ నెట్వర్క్ విస్తరణకు, నెక్స్ట్జెన్ టెక్నాలజీ 5జీ వేలంలో పాల్గొనడానికి రైట్స్ ఇష్యూ డబ్బును ఉపయోగించనుంది.
ఎయిర్టెల్లో, సింగపూర్కు చెందిన సింగ్టెల్కు 31.72 % వాటా, మిత్తల్ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 24.13 % వాటా ఉన్నాయి. మిగిలిన వాటాలు ప్రజలవి. వాటా దామాషా ప్రకారం... సింగ్టెల్ రూ. 6,661 కోట్లు, మిత్తల్ కుటుంబం రూ. 5,067 కోట్లను రైట్స్ ఇష్యూలో కంపెనీకి అందించాల్సి ఉంది. కాగా... 25 % తక్షణ చెల్లింపు ప్రకారం, ఈ ఇద్దరు ప్రమోటర్లు వరుసగా రూ. 1,665 కోట్లు, రూ. 1,267 కోట్లను ఇప్పటికిప్పుడు చెల్లించాలి.
సింగ్టెల్, మిత్తల్ కుటుంబం సంయుక్తంగా 56 % వాటా పంచుకుంటున్నాయి. ఈ ప్రకారం... రైట్స్ ఇష్యూలో సుమారు రూ. 11,730 కోట్లను(1.57 బిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కాగా... 25 % ప్రకారం... ఇద్దరూ కలిసి దాదాపు రూ. 2,932 కోట్లను ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. రైట్స్ ఇష్యూ చందాదారులు కూడా 25 % మొత్తాన్ని ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ అవసరాలను బట్టి, మిగిలిన డబ్బును రెండు వాయిదాల్లో చెల్లించాలి. మూడు సంవత్సరాల కాలంలో చెల్లింపులు పూర్తి కావాలి. ఎప్పుడు, ఎంత చెల్లించాలో కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది.
కాగా... వాటాదారులంతా ప్రతి 14 వాటాలకు ఒక యూనిట్ అందుకుంటారు. భారీ డిస్కౌంట్తో, రూ. 535 కే ఒక్కో యూనిట్ షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ అవుతుంది. ఇష్యూ ప్రారంభానికి ఒకరోజు ముందు, అంటే... సోమవారం 1.22 % పెరిగిన షేర్ ప్రైస్ 681.10 వద్ద ముగిసింది. సోమవారం నాటి క్లోజింగ్తో పోలిస్తే, దాదాపు 21.5 % తగ్గింపుతో ఒక్కో వాటా దక్కుతుంది.
ఇక ఒక్కో యూనిట్ భారీ డిస్కౌంట్లో వస్తోంది కాబట్టి, వాటాదారుల నుంచి బలమైన పార్టిసిపేషన్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత రైట్స్ ఇష్యూ ఈ నెల 21 న ముగియనుంది. కేవలం రెండేళ్లలో ఎయిర్టెల్ రెండో రైట్స్ ఇష్యూ ఇది. 2019 మేలో రైట్స్ ఇష్యూకు వెళ్లిన కంపెనీ... రూ. 25 వేల కోట్లను సమీకరించిన విషయం తెలిసిందే.