‘కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలం’
ABN , First Publish Date - 2022-01-20T16:34:13+05:30 IST
రాష్ట్రంలో కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకునేందుకు చీలికలుగా ఉన్న తెలుగు సంఘాలన్నీ కలిసి పోరాడి తేనే లక్ష్యాన్ని సాధించగలమని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు
- ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకునేందుకు చీలికలుగా ఉన్న తెలుగు సంఘాలన్నీ కలిసి పోరాడి తేనే లక్ష్యాన్ని సాధించగలమని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. మదురై మహా నగరాన్ని పాలించి చరిత్రలో స్థానం దక్కించుకున్న మహారాజు తిరుమల నాయకర్ 439వ జయంతి వేడుకలను ఏఐటీఎఫ్ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మదురెలో పలు ప్రాంతాల్లో ఉన్న తిరుమల నాయకర్, వీరపాండ్య కట్టబ్రహ్మన్న విగ్రహాలకు ఆచార్య సీఎంకే రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ తదితరుల నేతృత్వంలో ఏఐటీఎఫ్ నిర్వాహకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తిరుమలనాయకర్ మహాల్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, పేదలకు సహాయాలను సీఎంకే రెడ్డి అందజేశారు. అనంతరం వడమదురైలో కొత్తగా నిర్మించిన దంత వైద్యశాలను ప్రారంభించి, నాయుడు పేరవై కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయంత్రం 4 గంటలకు పాల్గొని సీఎంకే రెడ్డి ప్రసంగించారు. అమ్మ భాషను పరిరక్షించుకొనేందుకు తెలుగు వారంతా ఏకం కావాలని, తెలుగు మీడియంలో చదువుకుంటున్న విద్యార్థులు మాతృభాషలోనే పరీక్షలు రాసేలా ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా సమష్టిగా అహింసా మార్గంలో పోరాడాల్సిన అవసరం ఉందని రెడ్డి ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.