ఆశిష్ మిశ్రాను అరెస్టు చేస్తారా?

ABN , First Publish Date - 2021-10-09T20:03:45+05:30 IST

లఖింపూర్: లఖింపూర్ ఖేరి హింసాకాండ ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా..

ఆశిష్ మిశ్రాను అరెస్టు చేస్తారా?

లఖింపూర్: లఖింపూర్ ఖేరి హింసాకాండ ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారంనాడు పోలీసు విచారణ ముందు ఆయన హాజరయ్యారు. విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసు ఇవ్వడం ఇది రెండోసారి. ఆశిష్ కార్యాలయానికి రాగానే లఖింపూర్ ఖేరి ఎస్‌పీ విజయ్ ధుల్ మీడియాతో మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పారు. ఆశిష్‌ను అరెస్టు చేస్తారా అనే ప్రశ్నకు ఆయన స్పందించేందుకు నిరాకరించారు.


లఖింపూర్ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు నిరసన కారులపై తన తండ్రికి చెందిన వాహనాన్ని ఎక్కించిన ఆరోపణలను ఆశిష్ ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 8 మంది మృతి చెందారు. దీనిపై శుక్రవారం ఉదయం పోలీసుల ముందు ఆశిష్ హాజరుకావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. దీంతో రెండో నోటీసును పోలీసులు పంపారు. లఖింపూర్ ఖేరిలోని మంత్రి నివాసం బయట ఈ నోటీసులు అంటించారు. తికునియా పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసు ఆధారంగా సీఆర్‌పీఎఫ్ సెక్షన్ 160 కింద శుక్రవారం నోటీసులు పంపినప్పటికీ హాజరు కానందుకు మరో నోటీసు పంపుతున్నామని, శనివారం హాజరుకావాలని ఆదేశిస్తున్నామని, ఆ విధంగా చేయని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి 10 మంది పేర్లు తమ దృష్టికి వచ్చాయని, వీరిలో ఇద్దరిని గురువారం అరెస్టు చేశామని, ఐదుగురిని గుర్తించి హింసాకాండలో వారి పాత్రను పరిశీలిస్తున్నామని, మరో ముగ్గురు మృతి చెందారని లక్నో జోన్ ఏడీజీ సత్య నారాయణ సబత్ తెలిపారు.

Updated Date - 2021-10-09T20:03:45+05:30 IST