2022 శాసన సభ ఎన్నికలపై అఖిలేశ్ కన్ను... ఉత్తరాఖండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రకటన...
ABN , First Publish Date - 2020-10-19T00:10:13+05:30 IST
ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ దృష్టి సారించారు.
లక్నో : ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ దృష్టి సారించారు. 2022లో జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ కార్యనిర్వాహక కమిటీని ప్రకటించారు. దాదాపు ఓ నెల నుంచి జరుగుతున్న కసరత్తుకు తుది రూపం ఇచ్చారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షునిగా సత్యనారాయణ్ సచన్ను నియమించారు. ముగ్గురు ఉపాధ్యక్షులు, ఇద్దరు జనరల్ సెక్రటరీలు, 39 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి దివంగత వినోద్ బర్త్వాల్ సతీమణి అభా బర్త్వాల్కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. వినోద్ కుటుంబానికి ఉత్తరాఖండ్ కొండ ప్రాంతంలో గట్టి పట్టు ఉండటంతో ఆమెకు ఈ పదవి ఇచ్చారు.
సత్యనారాయణ్ సచన్ మాట్లాడుతూ, 2022 శాసన సభ ఎన్నికలపై తాము దృష్టి సారిస్తామని చెప్పారు. స్థానిక సమస్యలపై పోరాడుతామని, నిరుద్యోగం, వలసలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలను లేవనెత్తుతామని తెలిపారు.