ఫ్యాక్ట్ చెక్: మాజీ సీఎం ఫ్యామిలీతో సిట్టింగ్ సీఎం ఫొటో వైరల్.. నెట్టింట పలు ఊహాగానాలు!

ABN , First Publish Date - 2021-12-29T15:48:20+05:30 IST

సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలు వైరల్..

ఫ్యాక్ట్ చెక్: మాజీ సీఎం ఫ్యామిలీతో సిట్టింగ్ సీఎం ఫొటో వైరల్.. నెట్టింట పలు ఊహాగానాలు!

సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌లు ఒకచోట కూర్చుని ఏదో చర్చించుకుంటున్న ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను పలువురు యూజర్లు షేర్ చేస్తున్నారు. దీంతో ఇది చర్చాంశనీయంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ ఎస్ఎస్, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. 


అయితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఫొటో 2019 జూన్ నాటిది. ఇప్పటిది కాదు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫొటోను ఉద్దేశించి ఒక యూజర్ ‘కొత్త గాలి వీస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి కొత్తదనం వచ్చినట్టుంది. ఒకవైపు ఆర్ ఆర్ఎస్ఎస్, మరోవైపు బీజేపీ’ అని రాశారు. కాగా వైరల్ అవుతున్న ఈ ఫొటోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2019, జూన్ 10న యోగి ఆదిత్యనాథ్.. ములాయంసింగ్ యాదవ్‌ను లక్నోలోని అతని ఇంటిలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్, అతని చిన్నాన్న శివపాల్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. ఈ కలయికకు ముందురోజు ములాయం సింగ్ యాదవ్ స్వల్ప అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఈ సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్.. ములాయం ఇంటికి వచ్చి, అతనిని పరామర్శించారు. అప్పుడు తీసిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Updated Date - 2021-12-29T15:48:20+05:30 IST