ఆలకూరపాడుపై పోలీసుల నిఘా
ABN , First Publish Date - 2021-10-18T01:03:40+05:30 IST
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుపై పోలీసులు నిఘా ఉంచారు. అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ
ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుపై పోలీసులు నిఘా ఉంచారు. అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సహచరిణి శిరీష స్వగ్రామం కావడం, వారి కుమారుడు మున్నా కూడా ఉద్యమంలో ఉండి గతంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్థుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆర్కే మరణం అనంతరం మావోయిస్టులు, సానుభూతిపరులు సభలు, సమావేశాలు నిర్వహించే అవకాశాలపైనా ఆరా తీస్తున్నారు. గ్రామానికి వచ్చి వెళ్లే వారిపై కూడా పూర్తి నిఘా ఉంచారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ బి.రవిచంద్ర, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్, టంగుటూరు ఎస్సై నాయబ్రసూల్ ఆదివారం ఆలకూరపాడును సందర్శించారు. అక్కడ విరసం నేత కల్యాణ్రావుతో మాట్లాడారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ఏఎస్పీ రవిచంద్ర కోరారు. ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదని విరసం నేత కల్యాణరావు బదులిచ్చారు.