నాడు పులులు.. నేడు పిల్లుల్లా మారాయి: ఆలపాటి
ABN , First Publish Date - 2021-06-12T00:37:42+05:30 IST
సీఎం జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచడమంటే సాగిలపడటం, శాలువాలు కప్పడమేనా ? అని తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు.
అమరావతి: సీఎం జగన్రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచడమంటే సాగిలపడటం, శాలువాలు కప్పడమేనా? అని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ.. గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడివెడైన నేమి కరముపాలు అన్న విధంగా వైసీపీ ఎంపీలు 30 మంది ఉన్నా.. రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యమని దెప్పిపొడిశారు. నాడు కేంద్రం మెడలు వంచుతామని బీరాలు పలికిన పులులు.. నేడు పిల్లుల్లా మారాయని సెటైర్లు వేశారు. స్వప్రయోజనాల కోసం కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం జగన్ తహతహలాడుతున్నారన్నారు. రెండేళ్లల్లో 12 సార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్ రాష్ట్రానికి కనీసం రూ.12 కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం ఆపేస్తే కనీసం ప్రజల సొమ్ము కొంతైనా వృథా కాకుండా ఉంటుందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.