మద్యం మత్తులో కర్కశం

ABN , First Publish Date - 2022-01-30T08:40:27+05:30 IST

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, తోడబుట్టిన అక్కను కిరాతకంగా హత్య చేశాడు. ఆపై కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో

మద్యం మత్తులో కర్కశం

భార్య, సోదరిని హత్య చేసి ఆత్మహత్యాయత్నం

అడ్డుకోబోయిన ముగ్గురికి తీవ్రగాయాలు


ఎచ్చెర్ల, జనవరి 29: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, తోడబుట్టిన అక్కను కిరాతకంగా హత్య చేశాడు. ఆపై కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు రీసు అప్పన్న(38) మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం వేకువజామున మద్యం మత్తులో ఉన్న అప్పన్న.. నిద్రిస్తున్న భార్య అప్పమ్మ (35)పై రెండు కత్తులతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన అతని అక్క రాజుపైనా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. అప్పన్న తండ్రి అశిరోడు, మేనకోడలు పద్మ, సోదరుని కుమారుడు గోవింద్‌ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు.


అప్పమ్మ, రాజు అక్కడికక్కడే మృతి చెందగా అశిరోడు, పద్మ, గోవింద్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం.. అప్పన్న కూడా పీక కోసుకున్నాడు. క్షతగాత్రులందరినీ స్థానికులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పన్న పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు.

Updated Date - 2022-01-30T08:40:27+05:30 IST