ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోవడం తీవ్రమైన విషయం: సంజయ్ రావత్

ABN , First Publish Date - 2021-05-13T01:27:54+05:30 IST

ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో పలుచోట్ల కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవడంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్...

ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోవడం తీవ్రమైన విషయం: సంజయ్ రావత్

ముంబై: ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో పలుచోట్ల కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవడంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారిని జయించడం కోసం ముఖ్యమంత్రులంతా ఏకం కావాలని ఆయన అన్నారు. నిత్యం ఒకరినొకరు సంప్రదించుకోవాలనీ.. ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కొవిడ్ గణాంకాలను దాచరాదని ఆయన అన్నారు. నదుల్లో మృతదేహాలు తేలియాడుతున్న దృశ్యాలు అత్యంత భయంకరమన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బాల్లియా జిల్లాలో గంగానదిలో దాదాపు 50కి పైగా మృతదేహాలు బయటపడడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై రావత్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలోని పలుచోట్ల ఆక్సిజన్ లేక కొవిడ్ రోగులు మృతిచెందడం తీవ్రమైన విషయం. మహారాష్ట్రలో కూడా ఆక్సిజన్ కొరత ఉంది కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను చక్కగా నిర్వహిస్తోంది..’’ అని పేర్కొన్నారు. ఆక్సిజన్ లభ్యత, సరఫరా, పంపిణీలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నేషనల్ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసిందనీ.. రాష్ట్రాలన్నిటికీ ఆక్సిజన్‌ను శాస్త్రీయంగా కేటాయించాల్సిన బాధ్యత ఈ టాస్క్‌ఫోర్స్‌పై ఉందని రావత్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-13T01:27:54+05:30 IST