పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలి

ABN , First Publish Date - 2022-01-23T06:08:58+05:30 IST

పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్‌రావు అన్నారు.

పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలి
చిన్నారులతో మాట్లాడుతున్న డీఈవో జనార్ధన్‌రావు

   డీఈవో జనార్ధన్‌రావు

ఇల్లందకుంట, జనవరి 22: పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పాతర్లపల్లి గ్రామంలోని సీఆర్‌పీల ఆధ్వర్యంలో 6నుంచి 18ఏళ్లు ఉండి బడిమానేసిన పిల్లల వివరాల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీఈవో జనార్ధన్‌రావు పాతర్లపల్లి గ్రామాన్ని సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడి మానేసిన దివ్యాంగుల పిల్లల వివరాలు కూడా సేకరించాలని, ఏ కారణం చేతబడి మానేశారో వివరాలు పూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. బడి బయట పిల్లలందరూ ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విడపు శ్రీనివాస్‌, సీఆర్పీలు అజ్జు, శ్రీనివాస్‌, శృతికీర్తి తదితరులు పాల్గొన్నారు.


 హుజూరాబాద్‌లో...


హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ పట్టణంలోని విద్యావనరుల కేంద్రంలో డీఈవో జనార్ధన్‌రావు శనివారం సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి బయటి పిల్లల సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. బడి బయట పిల్లలను పూర్తిస్థాయిలో గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో సత్యప్రసాద్‌, రాజిరెడ్డి, రవిబాబు, రమేష్‌, అమరేందర్‌గౌడ్‌, దామోదరచారి, సుధామణి, శ్రీనివాస్‌, తిరుమల, మధు తదితరులు పాల్గొన్నారు.


శంకరపట్నంలో....


శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని చర్లపల్లి ఇటుకల బట్టీలో బడి బయటి పిల్లల సర్వేలో భాగంగా తనిఖీ చేయగా 6నుంచి 14ఏళ్ల పిల్లలను 10మందిని గుర్తించినట్లు ఎంఈవో వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో ఆదేశాల మేరకు పది మంది పిల్లలకు ఒక ప్రైవేట్‌ టీచర్‌ను నియమించామన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-23T06:08:58+05:30 IST