జనరల్ రావత్ ఎక్కడున్నా భారత్ అభివృద్ధిని చూస్తారు : మోదీ

ABN , First Publish Date - 2021-12-11T21:24:19+05:30 IST

తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్

జనరల్ రావత్ ఎక్కడున్నా భారత్ అభివృద్ధిని చూస్తారు : మోదీ

న్యూఢిల్లీ : తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఎంత శ్రమించారో యావత్తు దేశం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పటిష్టపరిచేందుకు ఆయన చేసిన కృషి కొనసాగుతుందని, కొత్త నిర్ణయాలతో భారత్ ముందుకెళ్ళడాన్ని ఆయన ఎక్కడ ఉన్నా చూస్తారని అన్నారు. తమిళనాడులోని కూనూరు వద్ద ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాసినవారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో రూ.9,800 కోట్ల విలువైన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. 


భారత దేశంలోని త్రివిధ దళాలను స్వయం సమృద్ధం చేయడం కోసం జనరల్ బిపిన్ రావత్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. ఈ కృషిని కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆయన ఎక్కడ ఉన్నా భారత దేశం దృఢ నిశ్చయంతో ముందుకెళ్తుండటాన్ని చూస్తారని తెలిపారు. భారత దేశం విచారంలో ఉన్నప్పటికీ, వేగాన్ని, అభివృద్ధిని ఆపేది లేదని చెప్పారు. భారత దేశం స్తంభించిపోదన్నారు. భారతీయులమంతా కలిసికట్టుగా పని చేస్తామని, దేశంలోపల, వెలుపల ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొంటామని తెలిపారు. 


Updated Date - 2021-12-11T21:24:19+05:30 IST