హైదరాబాద్: వ్యాక్సిన్ తరలింపుకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-01-13T20:56:14+05:30 IST
కోఠిలోని శీతల గిడ్డంగి నుంచి కరోనా వ్యాక్సిన్ను జిల్లాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్: కోఠిలోని శీతల గిడ్డంగి నుంచి కరోనా వ్యాక్సిన్ను జిల్లాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ జిల్లాలకు ఎన్ని డోస్ల వ్యాక్సిన్ను పంపించాలన్న అంశంపై వైద్యశాఖ అధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ సెంటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. పుణె నుంచి నిన్ననే కోవిడ్ వ్యాక్సిన్ హైదరాబాద్కు చేరుకుంది.
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకాలు రాష్ట్రానికి వచ్చేశాయి. తొలి విడతగా తెలంగాణకు కేంద్రం 3.64 లక్షల డోసులను పంపింది. మంగళవారం ఉదయం పుణే నుంచి ప్రత్యేక కార్గో విమానంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను పంపగా.. అవి మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో కోఠిలోని వ్యాధి నిరోధక టీకా సముదాయానికి 12.55 గంటలకు చేరుకున్నాయి.