ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్..!?
ABN , First Publish Date - 2021-07-18T08:51:26+05:30 IST
భారత్లో కరోనా మూడో వేవ్ ఇప్పటికే మొదలైందా ? అంటే గత రెండు వారాలకు చెందిన కొవిడ్ కేసుల తాజా గణాంకాలతో ఔననే సమాధానమే లభిస్తోంది.
- గత రెండువారాల కొవిడ్ గణాంకాలతో తేటతెల్లం
- వారంలోనే మూడు రెట్లు పెరిగిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ, జూలై 17 : భారత్లో కరోనా మూడో వేవ్ ఇప్పటికే మొదలైందా ? అంటే గత రెండు వారాలకు చెందిన కొవిడ్ కేసుల తాజా గణాంకాలతో ఔననే సమాధానమే లభిస్తోంది. 55 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా ఈనెల 7 నుంచి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఆ ఒక్క రోజునే కొత్తగా 784 యాక్టివ్ కేసులు పెరిగాయి. దీంతో మొత్తం సంఖ్య 4,59,920 నుంచి 4,60,704కు పెరిగింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.07 కోట్లు దాటింది. సరిగ్గా వారంలోనే (జూలై 14న) మరో 2,095 కొత్త యాక్టివ్ కేసులను గుర్తించారు. అంటే వారం వ్యవధిలోనే.. రోజువారీ యాక్టివ్ కేసులు మూడు రెట్లు పెరిగాయన్న మాట. ఇక ఇదే సమయంలో 73 జిల్లాల్లో ‘పాజిటివిటీ’ రేటు 10 శాతానికిపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో డెల్టా వేరియంట్ ప్రాబల్యం అత్యధికంగా ఉందని తేలింది. దీనివల్లే కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల నమోదవుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నెమ్మదించడాన్ని ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ చేసిన ప్రకటన కూడా మూడోవేవ్ ఇప్పటికే మొదలైందనే దిశగానే సంకేతాలిస్తోంది. వీటన్నింటికి మించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్.. ‘‘ప్రపంచ దేశాలు కరోనా మూడో వేవ్ ప్రాథమిక దశలో ఉన్నాయి’’ అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మనం ఏ దశలో ఉన్నామనేది చెప్పకనే చెప్పాయి.