ఆంక్షలు మాకేనా?

ABN , First Publish Date - 2020-04-08T09:26:45+05:30 IST

‘‘కరోనా విస్తరించకుండా అమలు చేస్తున్న ఆంక్షలు మాకు మాత్రమే వర్తిస్తాయా? రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వర్తించవా?’’ అంటూ అమరావతి ప్రాంత రైతులు మండిపడ్డారు.

ఆంక్షలు మాకేనా?

కోర్టు తీర్పులు లెక్క చేయరా?

అమరావతి రైతుల ఆగ్రహం

112వ రోజు కొనసాగిన ఆందోళన


గుంటూరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా విస్తరించకుండా అమలు చేస్తున్న ఆంక్షలు మాకు మాత్రమే వర్తిస్తాయా? రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వర్తించవా?’’ అంటూ అమరావతి ప్రాంత రైతులు మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 112వ రోజుకు చేరాయి. పెదపరిమి, నీరుకొండ దీక్షా శిబిరాల్లో రైతులు వంతుల వారీగా నిరసన ప్రదర్శనలు చేశారు.


అనంతవరం, తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం, కురగల్లు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఎక్కడికక్కడ వీధుల్లో కూర్చొని మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. చాలా ప్రాంతాల్లో మహిళలు ఇళ్లలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ‘‘రాజధాని అభివృద్ధితో రాష్ట్రం బాగుంటుందన్న ఆశతో మా భూములు ఇచ్చాం. ఇక్కడ  ఉద్దేశపూర్వకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రభుత్వం కుట్రలకు తెర తీస్తే సహించేది లేదు’’ అని రైతులు  తేల్చి చెబుతున్నారు.


  హైకోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయకుండా వచ్చి లేఅవుట్లు ఎలా వేస్తారని సీఆర్‌డీఏ అధికారులను నీరుకొండ, కొరగల్లు రైతులు నిలదీశారు.  కాగా, రాజధాని రైతులు ‘అమరావతి వెలుగు’ కొనసాగించారు. మంగళవారం రాత్రి 7.30 నుంచి ఐదు నిముషాలపాటు ఇళ్లలో విద్యుత్‌ను నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. 29 గ్రామాల కూడళ్లలో మహిళలు కొవ్వొత్తులు పట్టుకుని  ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించారు. 


Updated Date - 2020-04-08T09:26:45+05:30 IST