రాజధానిగా అమరావతే కావాలి.. నాడు అనుకూలమని నేడెందుకు కక్ష

ABN , First Publish Date - 2020-07-04T18:16:20+05:30 IST

ఎన్నికల సమయంలో చెప్పినట్లు అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందేనని 29 గ్రామాల రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ

రాజధానిగా అమరావతే కావాలి.. నాడు అనుకూలమని నేడెందుకు కక్ష

199వ రోజు ఆందోళనలో రాజధానుల రైతుల డిమాండ్‌


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో చెప్పినట్లు అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందేనని 29 గ్రామాల రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 199వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ మంత్రి ఇప్పట్లో రాజధాని తరలింపు లేదంటారు.. మరో మంత్రి  రాజధానిలో పర్యటించి ఆగిన నిర్మాణాలను పరిశీలిస్తారు.. మళ్లీ గవర్నర్‌ చేత మూడు రాజధానులనిపిస్తారు.. ఎందుకంత గందరగోళమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి అనుకూలంగా మాట్లాడుతూ.. నాడు వేల ఎకరాలు కావాలనలేదా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తర్వాత నుంచి రాజధానిపై కక్ష కట్టినట్లు ఉంటున్నారని తెలిపారు. 199 రోజులుగా రైతులు, మహిళలు, రైతు కూలీలు కన్నీటితో వేడుకుంటుంటే ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం రావాలంటూ అమరావతి వెలుగు కార్యక్రమం చేపట్టారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి శనివారం నాటికి 200వ రోజులు పూర్తి కావొస్తున్న సందర్భంగా రైతులు, మహిళలు, అసైన్డ్‌ రైతులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలను శుక్రవారం కూడా కొనసాగించారు.  

Updated Date - 2020-07-04T18:16:20+05:30 IST