నెక్ట్స్ ఏంటి?
ABN , First Publish Date - 2021-01-26T06:56:05+05:30 IST
సుప్రీం తీర్పుపై అధ్యయనం చేసిన తర్వాత..
సుప్రీం తీర్పుతో మెత్తబడిన నేతలు
రేపు ఏపీ అమరావతి జేఏసీ అత్యవసర సమావేశం
హాజరుకానున్న 94 ఉద్యోగ సంఘాలు
ఆ తరువాతే జేఏసీ నేతల ప్రకటన!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగ సంఘాలు మెత్తబడ్డాయి. వారం రోజులుగా తీవ్ర స్థాయిలో స్పందించిన పలువురు ఉద్యోగ సంఘాల నేతలు కాస్త తగ్గారు. ఎన్నికలను నిర్వహించవద్దని తాము అనలేదని, నిర్వహణలో పాలుపంచుకునే విషయమై భవిష్యత్తు కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెబుతున్నారు. ఇందుకోసం ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘ జేఏసీ బుధవారం విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
సుప్రీం తీర్పుపై అధ్యయనం చేసిన తర్వాత, ఉద్యోగుల రక్షణపై ప్రభుత్వం ఇచ్చే హామీని బట్టి తమ నిర్ణయం ప్రకటిస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రకటించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో, ఉద్యోగ సంఘాలన్నీ ఎన్నికల నిర్వహణపై చర్చించుకున్నాయి. సుప్రీం తీర్పును గౌరవించక తప్పదన్న అభిప్రాయం ఆంతరంగిక చర్చల్లో వ్యక్తమైనట్టు తెలిసింది.
కాగా ఎన్నికలు నిర్వహించవద్దని ఎప్పుడూ అనలేదని, ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉన్నదనే తమ భయమని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ప్రధాన ఉద్యోగ సంఘాల జేఏసీలైన ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో సంఘాలు చర్చించి, అధ్యయనం చేసిన తర్వాతే భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నాయి. ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం బుధవారం జేఏసీలోని 94 సంఘాలతో విజయవాడ నగరంలోని రెవెన్యూ భవన్లో సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనే ఉద్యోగ సంఘాలు దాదాపు సుప్రీం తీర్పును గౌరవించాల్సిందేనని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల రక్షణకు తీసుకునే చర్యలను చర్చనీయాంశం చేసి, సహకరిస్తామన్న సానుకూల వాదనలను తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం తీర్పు తర్వాత సాయంత్రానికి ప్రభుత్వం నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తుండటంతో.. ఉద్యోగ సంఘాల నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు.
కాగా తాజా పరిణామాలతో పలువురు ఉద్యోగులు ప్రభుత్వంపైనా, ఎస్ఈసీ పైనా విమర్శలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఉభయులూ సమన్వయం చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదని అంటున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఉద్యోగుల మీద చర్యల గురించి ఎస్ఈసీ మాట్లాడటం, ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయిస్తామనే సంకేతాలు ఇవ్వటంతో ఉభయులూ హైకోర్టు తీర్పును గౌరవించలేదనేది స్పష్టమయిందని ఒక సెక్షన్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిర్వహణ సంగతి పక్కన పెడితే.. ఈ వ్యవహారంలో ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఉద్యోగులు అంటున్నారు.
డీఏ, పీఆర్సీ తదితర సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపట్టాల్సిందేనన్న తమ డిమాండ్ను సంఘాల నేతలు అంగీకరించలేదని, ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే.. తమ పక్షాన గట్టిగా వాదనలు వినిపిస్తున్నారని మండిపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న కాలంలోనే ప్రాణాలను ఫణంగా పెట్టి ఫ్రంట్లైన్ విధులు నిర్వహించామని, ఇప్పుడు కూడా అదే విధంగా విధులు నిర్వహించగలమనే వాదనలను ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతాయి కాబట్టి.. వేలాదిమందితో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని, అటువంటి స్థితిలో తగిన రక్షణ పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంటుందని అంటున్నాయి.