సీజ్ చేసిన ఇసుక మాయం
ABN , First Publish Date - 2021-07-30T06:14:01+05:30 IST
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసి తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో నిల్వచేసిన సుమారు 100 టన్నుల ఇసుక మాయమైన సంఘటన గురువారం వెలుగుచూసింది.
అపహరణ వెలుగుచూడకుండా రెవెన్యూ అధికారి యత్నం
అమరావతి, జూలై 29: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసి తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో నిల్వచేసిన సుమారు 100 టన్నుల ఇసుక మాయమైన సంఘటన గురువారం వెలుగుచూసింది. అమరావతి తహసీల్దారు కార్యాలయ సమీపంలోనే పోలీసు స్టేషన్ ఉన్నా కూడా ఇసుకను అపహరించుకెళ్లారు. సీజ్ చేసిన ఇసుకను ఇక్కడే నిల్వ చేస్తుంటారు. సుమారు రెండేళ్ల క్రితం నిల్వ ఉంచిన ఇసుకను ఇటీవల అక్రమార్కులు రాత్రి వేళల్లో తరలించుకెళ్లారు. ఈ విషయం ఇటీవల వెలుగుచూసింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాల్సిన రెవెన్యూ అధికారి బయటకు రాకుండా ఉండేందుకు గురువారం ఉదయం లారీ ద్వారా సుమారు 20 టన్నులు తెప్పించి ఆ ప్రాంతంలోనే పోయించారు.