ఈసారి అమ‌ర్‌నాథ్ యాత్ర ఎలా జ‌ర‌గ‌బోతోందంటే...

ABN , First Publish Date - 2020-07-01T13:34:20+05:30 IST

ఈసారి అమర్‌నాథ్ యాత్రలో భక్తులు కాలిన‌డ‌క‌న కాకుండా, హెలికాప్టర్‌లో గుహ వ‌ర‌కూ వెళ్లాల్సివుంటుంది. ఈ యాత్రసాగించే ప్రతి భక్తునికి ముందుగా కరోనా పరీక్షలు చేయ‌నున్నారు. ఇదిపూర్త‌య్యాకే వారిని యాత్ర‌కు...

ఈసారి అమ‌ర్‌నాథ్ యాత్ర ఎలా జ‌ర‌గ‌బోతోందంటే...

శ్రీనగర్: ఈసారి అమర్‌నాథ్ యాత్రలో భక్తులు కాలిన‌డ‌క‌న కాకుండా, హెలికాప్టర్‌లో గుహ వ‌ర‌కూ వెళ్లాల్సివుంటుంది. ఈ యాత్రసాగించే ప్రతి భక్తునికి ముందుగా కరోనా పరీక్షలు చేయ‌నున్నారు. ఇదిపూర్త‌య్యాకే వారిని యాత్ర‌కు అనుమ‌తిస్తారు. ఇందుకోసం జమ్మూలోని లఖన్‌పూర్ లేదా భగవతినగర్‌లో ఒక వైద్య‌పరీక్ష‌ల కేంద్రం ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ను పూర్తిచేసిన‌ప్ప‌టికీ, ఇంకా ప్రకటించవలసి ఉంది. జూలై రెండవ వారంలో ఆల‌య‌ బోర్డు సమావేశం జ‌ర‌గ‌నుంది. అప్పుడు భ‌క్తుల ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం దేశంలో క‌రోనా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు సం‌బంధించి పలు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల‌ జ‌మ్ముక‌శ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి వివిధ విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజరయ్యారు. కాగా ఈ యాత్ర కొద్ది రోజులు మాత్రమే జర‌గ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. 

Updated Date - 2020-07-01T13:34:20+05:30 IST