చైనాపై అమెరికా ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-11T21:44:10+05:30 IST

సార్వజనీన హక్కులను చైనా అవమానిస్తోందని అమెరికా ఆగ్రహం

చైనాపై అమెరికా ఆగ్రహం

న్యూఢిల్లీ : సార్వజనీన హక్కులను చైనా అవమానిస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) అధికారులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో, సార్వజనీన హక్కుల పట్ల చైనాకు గౌరవం లేదని చెప్పడానికి ఆ దేశ చర్యలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. జింజియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, అత్యాచారాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్ళించడానికి చైనా ప్రయత్నిస్తోందన్నారు. దౌత్యపరమైన, ఆర్థిక సాధనాల ద్వారా మానవ హక్కులను అమెరికా సమర్థిస్తుందని పునరుద్ఘాటించారు. 


మాజీ యూఎస్‌సీఐఆర్ఎఫ్ కమిషనర్ జానీ మూరేపై డిసెంబరు 21న చైనా ఆంక్షలు విధించింది. అమెరికాలో మూరే ఓ ఎవాంజలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ బిజినెస్‌మ్యాన్. యూఎస్‌సీఐఆర్ఎఫ్ చైర్‌పర్సన్ నదినే మయెంజా, వైస్ చైర్‌పర్సన్ నురి టుర్కెల్, కమిషనర్ అనురిమ భార్గవ, కమిషనర్ జేమ్స్ డబ్ల్యూ కార్‌లపై కూడా ఆంక్షలు విధించింది. 


చైనా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, చైనా అధికారులపై అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగానే అమెరికా అధికారులపై చైనా ఆంక్షలు విధించింది. జింజియాంగ్ ప్రావిన్స్‌లోని వీఘర్లతోపాటు మైనారిటీలపై చైనా దాడులు చేసి, నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించిందని  తెలిపింది. 


సహజసిద్ధ స్థానికుల పట్ల చైనా శత్రుత్వ భావం ప్రదర్శిస్తోందని బ్లింకెన్ అన్నారు. మానవ హక్కులకు మద్దతిచ్చేవారిని సైతం శత్రువులుగా పరిగణిస్తోందన్నారు. 


Updated Date - 2022-01-11T21:44:10+05:30 IST