చెత్తలో రెండు బ్యాగులు.... తెరవగానే దిమ్మతిరిగేంత సొమ్ము!
ABN , First Publish Date - 2020-05-21T12:03:28+05:30 IST
నిజాయితీ కన్నా గొప్పవిషయం మరొకటి ఉండదు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇటువంటి సమయంలో ఒక అమెరికన్ కుటుంబానికి రోడ్డు పక్కన ఉన్న చెత్త డంప్లో కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. అయితే వారు ఆ మొత్తాన్ని తమ వద్ద...
న్యూయార్క్: నిజాయితీ కన్నా గొప్పవిషయం మరొకటి ఉండదు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇటువంటి సమయంలో ఒక అమెరికన్ కుటుంబానికి రోడ్డు పక్కన ఉన్న చెత్త డంప్లో కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. అయితే వారు ఆ మొత్తాన్ని తమ వద్ద ఉంచుకోకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు. దీంతో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. వర్జీనియాకు చెందిన డేవిడ్, ఎమిలీ షాంట్జ్ తమ పిల్లలతో కరోలిన్ కౌంటీలోని వారి ఇంటి నుండి కారులో బయటకు వెళుతున్నారు. కొంత దూరం వెళ్లాక వారికి రోడ్డు పక్కన ఉన్న చెత్త డంప్లో రెండు పెద్ద బ్యాగులు కనిపించాయి. డేవిడ్ కారు ఆపి ఆ బ్యాగులు తీసుకున్నాడు. వాటిపై ప్రభుత్వ స్టాంప్ ఉంది. వాటిని కారులో ఉంచి, ముందుకు బయలు దేరారు. తిరిగి ఇంటికి వచ్చాక డేవిడ్ ఆ బ్యాగులు తెరిచి చూశాడు. వాటిలోపల ఒక మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు 7.50 కోట్ల రూపాయలు) ప్లాస్టిక్ సంచులలో నింపి ఉంచారు. ఈ విషయాన్ని అతను కరోలిన్ కౌంటీ పోలీసులకు తెలియజేశాడు. కొద్దిసేపట్లో పోలీసు బృందం అతని ఇంటికి వచ్చి, ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా కరోలిన్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ నగదు రహదారిపైకి ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రస్తుత కాలంలో డేవిడ్. ఎమిలీలు నిజాయితీకి ఉదాహరణగా నిలిచారన్నారు.