ఆటా ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు.. సాహిత్య సంబరాలు

ABN , First Publish Date - 2021-08-16T01:52:25+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షులు భువనేశ్ బుజాల ఆధ్వర్యంలో శనివారం రోజు ‘ఆటా సాహిత్య వేదిక’ కార్యక్రమాన్ని బోర్డు ఆఫ్ ట్రస్టీ, సాహిత్య వేదిక కమిటీ చైర్ శారద సింగిరెడ్డి, సహబృంద సభ్యులు విజయ

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు.. సాహిత్య సంబరాలు

వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షులు భువనేశ్ బుజాల ఆధ్వర్యంలో శనివారం రోజు ‘ఆటా సాహిత్య వేదిక’ కార్యక్రమాన్ని బోర్డు ఆఫ్ ట్రస్టీ, సాహిత్య వేదిక కమిటీ చైర్ శారద సింగిరెడ్డి, సహబృంద సభ్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శారద సింగిరెడ్డి ప్రారంభించగా.. కృష్ణవేణి మల్లావజ్జల వ్యాఖ్యతగా వ్యవహరించారు. అనంతరం అధ్యక్షులు భువనేశ్ బుజాల.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వక్తలను సభకు పరిచయం చేశారు. ఆటా కార్యాచరణ, కార్యక్రమాల గురించి వివరించారు.

       

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు డా. నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో.. కవి గేయ రచయిత సాహితీవేత్త డా.నందిని సిదారెడ్డి, తెలుగు వేద కవి శతకానందకారక శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య శ్రీ. మసన చెన్నప్ప పాల్గొని స్వాతంత్ర్య ఉద్యమంలో, నేటి సమాజంలో సాహిత్యం పాత్ర, తెలుగు భాష ప్రాధాన్యత వంటి అంశాల గురించి మాట్లాడారు.



నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తెలుగు భాష పూర్తిగా కనుమరుగు కాకముందే ఈ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువు ఉన్నప్పటికీ.. తెలుగుని తప్పనిసరిగా ఒక భాషగా పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగును పరిరక్షించేందుకు సలహాలు సూచనలు చెయ్యవలిసిందిగా విజ్ఞప్తి చేశారు. నందిని సిదారెడ్డి ప్రసంగిస్తూ.. సంస్కృతం, తెలుగు భాషలను పక్కపక్కనే పెట్టడం సమంజసం కాదన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తెలుగు భాషాభిమానులు, మేధావులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.


జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.. వందేమాతరం నినాదం, త్రివర్ణ పతాకం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించాయి అని.. ఈ తరం వారు కూడా దేశం పట్ల, తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల అభిమానాన్ని, చైతన్యాన్ని కలిగి ఉండాలన్నారు. ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ.. తెలుగు భాష ఎప్పటికి సుసంపన్నంగా ఉంటుందని.. అలా ఉండడానికి విశ్రాంత తెలుగు అధ్యాపకులు, భాష అభిమానులు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలా జరిగినప్పుడు తెలుగు భాష ఎప్పటికీ అంతరించిపోదని అభిప్రయాపడ్డారు. ఈ కార్యక్రమంలో గాయని అనన్య పెనుగొండ జాతీయ గీతాన్ని ఆలిపించారు. ఇమిటేషన్ రాజు మిమిక్రీ, రాఘవ ఫ్లూట్, కౌండిన్య వయొలిన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు కార్యవర్గం అందరికీ వజ్రోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిజయజేశారు.


Updated Date - 2021-08-16T01:52:25+05:30 IST