ఒమైక్రాన్ ఆందోళన : దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది ఎక్కడున్నారో?

ABN , First Publish Date - 2021-12-03T21:18:03+05:30 IST

కోవిడ్-19 రూపాంతరం ఒమైక్రాన్ భయాందోళన

ఒమైక్రాన్ ఆందోళన : దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది ఎక్కడున్నారో?

బెంగళూరు : కోవిడ్-19 రూపాంతరం ఒమైక్రాన్ భయాందోళన తీవ్రంగా ఉన్న సమయంలో కర్ణాటకలోని బెంగళూరుకు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన దాదాపు 10 మంది ఆచూకీ తెలియడం లేదు. కర్ణాటకలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదవడంతో వీరు ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో? ఎలా ఉన్నారో? తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 


బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమిషనర్ గౌరవ్ గుప్తా శుక్రవారం మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. వీరి ఆచూకీ కోసం ఆరోగ్య శాఖాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ కోసం ప్రయత్నించడం నిరంతర ప్రక్రియ అని, దానిని తాము కొనసాగిస్తామని చెప్పారు. ఫోన్ కాల్స్‌కు స్పందించనివారి వివరాలు తెలుసుకోవడానికి ప్రామాణిక నిబంధనలు ఉన్నాయని, వాటిని అనుసరిస్తామని చెప్పారు. తన వద్ద సమాచారం లేదని, జాగ్రత్తగా ఉంటూ, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నానని చెప్పారు. 


కర్ణాటక ఆరోగ్య శాఖ మత్రి డాక్టర్ కే సుధాకర్ మాట్లాడుతూ, ఒమైక్రాన్‌ను దక్షిణాఫ్రికాలో గుర్తించిన తర్వాత 57 మంది ప్రయాణికులు బెంగళూరు వచ్చారన్నారు. వీరిలో 10 మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. వారి మొబైల్ ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయని, వారు ఇచ్చిన చిరునామాలలో వారు లేరని తెలిపారు. 


కర్ణాటకలో రెండు ఒమైక్రాన్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు విదేశీయుడు, మరొకరు స్థానికుడు. 


Updated Date - 2021-12-03T21:18:03+05:30 IST