Covid : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎలా?
ABN , First Publish Date - 2022-01-12T19:21:46+05:30 IST
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లోక్సభ, రాజ్యసభలలో షిఫ్ట్లవారీగా
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లోక్సభ, రాజ్యసభలలో షిఫ్ట్లవారీగా జరగబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కేసులు పెరుగుతుండటంతోపాటు పార్లమెంటు సిబ్బంది దాదాపు 400 మంది ఈ వ్యాధి బాధితులు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను బుధవారం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను లోక్సభ, రాజ్యసభలలో షిఫ్టులవారీగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు చెప్పినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. కోవిడ్ ప్రోటోకాల్ను కఠినంగా అమలు చేయవలసిన అవసరం ఉందని ఆ వర్గాలు చెప్పినట్లు తెలిపింది.
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఈ సమావేశాలను రాజ్యసభ, లోక్సభలలో షిఫ్టులవారీగా నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని తెలిపింది. ఈ సమావేశాలు దాదాపు 15 రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే, బడ్జెట్ను ప్రవేశపెట్టే రోజు మినహా, మిగతా రోజుల్లో రాజ్యసభ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు; లోక్సభ సమావేశాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. బడ్జెట్ను ప్రవేశపెట్టే రోజున లోక్సభ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి.