ఉగ్రవాద సంస్థ పార్లమెంటు ఘెరావ్ హెచ్చరిక... భద్రత కట్టుదిట్టం...
ABN , First Publish Date - 2021-11-29T16:20:32+05:30 IST
నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)
న్యూఢిల్లీ : నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) పార్లమెంటు హౌస్ను ఘెరావ్ చేసే అవకాశం ఉందని, పార్లమెంటు భవనంపై ఖలిస్థాన్ జెండాను ఎగురవేసే అవకాశం ఉందని నిఘా సమాచారం రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సంస్థ కౌన్సిల్ జనరల్ గుర్పత్వంత్ సింగ్ పన్ను యూట్యూబ్లో ఓ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
పన్ను విడుదల చేసిన వీడియోలో రైతులకు ఓ సందేశం ఉంది. శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటును ఘెరావ్ చేయాలని, ఖలిస్థాన్ జెండాను ఎగురవేయాలని రైతులకు పన్ను పిలుపునిచ్చాడు. పార్లమెంటు భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసిన వ్యక్తికి 1,25,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంబంధిత వ్యవస్థలన్నిటినీ హెచ్చరించాయి. ఢిల్లీ పోలీసులతో సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. పార్లమెంటు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23 వరకు జరుగుతాయి.