వేములవాడలో ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం

ABN , First Publish Date - 2021-10-15T07:19:29+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో గురువారం రాత్రి శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది.

వేములవాడలో ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం
రాజన్న ఆలయ ధర్మగుండంలో అమ్మవారి తెప్పోత్సవం

వేములవాడ, అక్టోబర్‌ 14 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో గురువారం రాత్రి శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీశరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాగౌరి అవతార అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారిని వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయ ధర్మగుండం వరకు తీసుకువెళ్లి విద్యుద్దీపాలతో హంస ఆకారంలో రూపొందించిన ప్రత్యేక తెప్పపై శ్రీరాజరాజేశ్వరిదేవి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ధర్మగుండంలో తెప్పోత్సవం నిర్వహించారు. ఘనంగా సాగిన ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈఓ కృష్ణప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T07:19:29+05:30 IST